ముంబై : మహారాష్ట్రలోని ప్రముఖ దేవాలయమైన శ్రీ షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ (ఎస్ఎస్ఎస్టీ) పేరిట పలువురు అక్రమార్కులు మోసాలకు పాల్పడుతున్నారు. ప్రత్యేక పూజల పేరుతో సోషల్ మీడియా వేదికగా అక్రమాలకు పాల్పడుతున్నట్లు సంస్థాన్ ట్రస్ట్ తెలిపింది. గత వారాంతంలో కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు తాము ఆలయ ప్రతినిధులగా చెప్పుకుంటూ సోషల్ మీడియా వేదికగా విరాళాలు సేకరిస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని ట్రస్ట్ సీఈఓ కన్హురాజ్ బగాటే తెలిపారు. పూజ, హారతి, ప్రసాదాల పేరిట విరాళాలు ఇవ్వాలంటూ వాట్సాప్, ఫేస్బుక్, ఇతర సోషల్ మీడియా గ్రూపుల ద్వారా విరాళాలు సేకరిస్తున్నట్లు తమకు సమాచారం అందిందని, ఈ మేరకు ప్రాథమిక విచారణ జరపగా.. మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించినట్లు ట్రస్ట్ ప్రతినిధి ఏక్నాథ్ గోండ్కర్ పేర్కొన్నారు.
కరోనా ప్రభావంతో ఏప్రిల్ 5 నుంచి సాయిబాబా ఆలయాన్ని మూసివేశామని ట్రస్ట్ సీఈఓ తెలిపారు. పేటీఎం, గూగుల్ పే ద్వారా అన్నదానం కోసం విరాళాలు సేకరిస్తున్నారని, కానీ.. వాటి ద్వారా సంస్థాన్ ట్రస్ట్ ఎలాంటి విరాళాలు స్వీకరించలేదని, వాటితో ట్రస్ట్కు సంబంధం లేదని బగాటే స్పష్టం చేశారు. కొందరు మోసపూరితంగా షిర్డీ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు మరింత విచారణ జరిపిన అనంతరం.. కుంభకోణం వెనుక ఉన్న నిందితులను గుర్తించేందుకు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు గోండ్కర్ పేర్కొన్నారు. అయితే, భక్తులు మోసాలపై అప్రమత్తంగా ఉండాలని భక్తులను ట్రస్ట్ కోరింది. విరాళాల కోసం ఎవరైనా ఫోన్ చేస్తే స్పందించే ముందు ట్రస్ట్ అధికారులను, అధికారిక వెబ్సైట్, ఈ మెయిల్ ద్వారా సంప్రదించాలని సూచించింది.