లక్నో: భారతీయ నావికుడు వెనిజులాలో పని చేస్తూ కార్గో షిప్లో మరణించాడు. నెల తర్వాత అతడి మృతదేహం భారత్కు చేరుకున్నది. పోస్ట్మార్టం నిర్వహించగా మెదడు, గుండె, ఊపిరితిత్తులు వంటి అంతర్గత అవయవాలు మాయమైనట్లు తేలింది. (Brain, heart, lungs missing) ఇది తెలుసుకుని అతడి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ఉత్తరప్రశేలోని డియోరియా జిల్లాకు చెందిన 33 ఏళ్ల రాకేష్ చౌహాన్ తన భార్య, ఆరు నెలల కుమారుడు, తండ్రి, సోదరుడితో కలిసి ముంబై నివసించాడు.
కాగా, 2025 నవంబర్లో మర్చంట్ నేవీలో చేరిన రాకేష్ చౌహాన్, వెనిజులాలో మెరైన్ ఫిట్టర్గా పనిచేశాడు. ఈ ఏడాది మే 7న రాకేష్ ప్రమావశాత్తు నౌక డెక్పై పడి తీవ్రంగా గాయపడినట్లు అతడు పనిచేస్తున్న కంపెనీ నుంచి తండ్రికి ఫోన్ వచ్చింది. మరునాడు అతడి పరిస్థితి విషమంగా ఉన్నదని సమాచారం ఇచ్చారు. ఆ రోజు సాయంత్రం రాకేష్ చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించినట్లు ఆ కంపెనీ తెలియజేసింది.
మరోవైపు సుమారు నెల రోజుల తర్వాత రాకేష్ మృతదేహం భారత్కు చేరుకున్నది. పరీక్షించిన వైద్య బృందం విదేశంలోనే పోస్ట్మార్టం జరిగినట్లు పేర్కొంది. తిరిగి పోస్ట్మార్టం నిర్వహించలేమని వైద్య బృందం తెలిపింది. అయితే ఈ విషయాన్ని కంపెనీ తమకు తెలియజేయలేదని అతడి కుటుంబం ఆందోళన వ్యక్తం చేసింది.
కాగా, డియోరియా జిల్లా కలెక్టర్ ఆదేశాలతో రాకేష్ మృతదేహానికి రెండోసారి పోస్ట్మార్టం నిర్వహించారు. అయితే శరీరం లోపల అంతర్గత అవయవాలేవీ లేవని వైద్యులు గుర్తించారు. మెదడు, గుండె, ప్లీహం, కాలేయం, క్లోమం, పిత్తాశయం, రెండు మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, పేగులు, కరోనరీ ధమనులు, మూత్రాశయం, ఇతర అవయవాలు కూడా లేవని వెల్లడైంది.
అంతేకాకుండా రాకేష్ శరీరంపై మెడ నుంచి మర్మాంగం వరకు, ఎడమ చెవి నుంచి కుడి చెవి వరకు మొత్తం 22 కుట్లు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఎలాంటి అంతర్గత అవయవాలు మిగలకపోవడంతో అతడి మరణానికి ఖచ్చితమైన కారణాన్ని ఫోరెన్సిక్ పరీక్షలో నిర్ధారించలేకపోయారు.
మరోవైపు రాకేష్ మృతదేహంలోని అన్ని అవయవాలు మాయమైనట్లు తెలుసుకుని అతడి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. వెనుజులా సంస్థ కీలక సమాచారాన్ని దాచిపెట్టినట్లు ఆరోపించారు. రాకేష్ మరణంపై సమగ్ర విచారణ జరుపాలని, ఆర్థిక పరిహారం ఇవ్వాలని అతడి కుటుంబం డిమాండ్ చేసింది.
కాగా, ‘ఫెడరేషన్ ఆఫ్ సీఫేరర్స్ యూనియన్స్ ఆఫ్ ఇండియా’ కూడా రాకేష్ మరణంపై పలు ప్రశ్నలు లేవనెత్తింది. కుటుంబానికి తెలియజేయకుండా, వారి అనుమతి తీసుకోకుండా అతడి శరీరం నుంచి కీలక అవయవాలను ఎందుకు తొలగించారని నిలదీసింది. మృతదేహానికి సంబంధించిన రసీదు నకిలీదని, అతడి భార్య పేరును తప్పుగా పేర్కొన్నారని, ఉద్యోగ ఒప్పందంలో పేర్కొన్న నౌక పేరు, అతడు వాస్తవంగా పనిచేసిన నౌక పేరుతో సరిపోలడం లేదని ఆరోపించింది. ‘ఈ వ్యత్యాసాలు పలు అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఏమి దాస్తున్నారు? వెనిజులాలోని భారత రాయబార కార్యాలయం తక్షణమే జోక్యం చేసుకోవాలని మేం కోరుతున్నాం’ అని ఒక ప్రకటనలో యూనియన్ పేర్కొంది. రాకేష్ చౌహాన్ కుటుంబానికి న్యాయం, జవాబుదారీతనం, తగిన పరిహారం అందించాలని డిమాండ్ చేసింది.