హుస్నాబాద్, ఏప్రిల్ 26: రవాణా శాఖ మంత్రి ఇలాకా హుస్నాబాద్లో బస్సు సర్వీసులు రద్దు చేయడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు గడిపె మల్లేశ్ అన్నారు. శుక్రవారం ఆయన హుస్నాబాద్లో విలేకరులతో మాట్లాడారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ ప్రాంతంలో సరైన బస్సు సౌకర్యం లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. 20 రోజులుగా హుస్నాబాద్ నుంచి హైదరాబాద్కు వెళ్లే బస్సు సర్వీసులను డిపో అధికారులు రద్దు చేశారని, దీంతో హైదరాబాద్, సిద్దిపేటకు వెళ్లే ప్రయాణికులు అవస్థలు పడాల్సి వస్తోందన్నారు. ప్రతిరోజూ ఉదయం 5గంటలకు హుస్నాబాద్ నుంచి బయలుదేరే సూపర్ లగ్జరీ బస్సు ఉద్యోగులకు, వ్యాపారులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేదని, దీనిని డిపో మేనేజర్ సొంత నిర్ణయంతో రద్దు చేశాడని ఆరోపించారు.
హుస్నాబాద్ రూట్లపై అవగాహన లేని డిపో మేనేజన్ ఇష్టానుసారంగా బస్సులు నడిపిస్తూ డిపోను నష్టాల్లోకి నెట్టుతున్నాడని ఆరోపించారు. కాలం చెల్లిన బస్సులను డిపోకు కేటాయించడంతో పలుమార్లు ప్రయాణికులతో వెళ్తుండగానే టైర్లు ఊడిపోయిన సంఘటనలు చోటు చేసుకున్నాయని తెలిపారు. ఇప్పటికైనా కరీంనగర్ ఆర్ఎం స్పందించి రద్దయిన బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న డిపో మేనేజర్ను చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి పొన్నం స్పందించి కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులు తెప్పించాలని, అన్ని రూట్లలో బస్సులు వెళ్లేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు.