సనాతన ధర్మానికి చెదలు పట్టినప్పుడల్లా పురుగు మందు చల్లి సంస్కరించిన మహనీయులు ఎందరో! అలాంటివారిలో జగద్గురువు ఆదిశంకరాచార్యులు ముఖ్యుడు. కాలడిలో జన్మించి కాలినడకన దేశమంతా రెండు పర్యాయాలు సంచరించి వైదిక ధర్మాన్ని నిలబెట్టిన మహనీయుడు ఆయన. ముక్కుపచ్చలారని బాల బ్రహ్మచారి ముఖంలో బ్రహ్మతేజస్సు స్పష్టంగా కనిపించేది. ఆయన పిలిస్తే దేవతలు పలికేవారు అనడానికి ఉదాహరణలు కోకొల్లలు. ఒక పేద ఇల్లాలిని అనుగ్రహించడానికి కనకధార స్తవంతో అమ్మవారిని అర్చించి.. పూరి గుడిసె వాకిట బంగారు ఉసిరికాయల వర్షం కురిపించిన ఉదంతం అద్భుతం.
ఎవరైతే ఈ స్తోత్రాన్ని భక్తిశ్రద్ధలతో త్రికాలాలలో పారాయణం చేస్తారో వారు కుబేరునితో సమానమైన సంపదలను పొందుతారని లక్ష్మీకటాక్షం అనుగ్రహించాడు. అప్పటికి జగద్గురువు బాల శంకరుడే! జీవితకాలం అధ్యయనం చేసినా అంతుబట్టని వేద వాఙ్మయాన్ని అనతికాలంలోనే ఆపోశన పట్టి.. బ్రహ్మసూత్రాలకు భాష్యం రాసిన సరస్వతీ పుత్రుడు శంకరులు. మంచినీళ్ల కోసం నది దాకా వెళ్లలేకపోతున్న తల్లి ఆర్యాంబను చూసి బాల శంకరుడి మనసు తల్లడిల్లింది. పూర్ణా నది గమనాన్ని మార్చి అమ్మ పడుతున్న కష్టాన్ని దూదిపింజలా తేల్చేశాడు.
సన్యాసాశ్రమ స్వీకారానికి, తల్లి అనుమతి కోసం మకరం పట్టుకుందని నమ్మబలికాడు. మతిమాలిన ధర్మాలు పట్టిపీడిస్తున్న ఆర్ష సంస్కృతిని ఉద్ధరించడానికి పాలుగారే పసివయసులోనే సన్యసించాడు. అదే సమయంలో తల్లి తలుచుకోగానే వస్తానని చెప్పి దేశాటనకు బయల్దేరాడు. ఇచ్చిన మాట ప్రకారం అవసాన దశలో ఉన్న తల్లి తలుచుకోగానే వచ్చాడు. చివరి ఘడియల్లో ఉన్న అమ్మకు హరిహరుల దర్శనం గావించి అద్వైత భావాన్ని అనుభవింపజేశాడు. కన్నుమూసిన తల్లికి అంతిమ సంస్కారం నిర్వహించాడు.
కర్మభూమి భారతావనిలో జ్ఞానామృతాన్ని పంచడానికి తన జీవితాన్ని ధారపోశాడు. అనైక్యతతో, భిన్న భిన్న దేవతారాధనలతో, పిడివాదాలతో, పాషండ మతాలతో అతలాకుతలమై వేదధర్మం క్లిష్టస్థితిలో ఉన్న సమయంలో హైందవ జాతికి సక్రమ దిశానిర్దేశం చేసే ఒక దీపస్తంభంలా అసామాన్య సంస్కార వారసత్వాన్ని ప్రసాదించాడు. తన బోధనలు, వాదనల ద్వారా హైందవ తత్వాన్ని జగజ్జేగీయమానం చేశాడు. ఆధ్యాత్మిక విజ్ఞాన పునఃస్థాపన కోసం దేశమంతా సంచరించి, పంచాయతన పూజా విధానాన్ని ఏర్పాటుచేశాడు. షణ్మత స్థాపనాచార్యుడిగా, అద్వైత సిద్ధాంత ప్రతిష్ఠాపనాచార్యులై జగద్గురువుగా నిలిచాడు.
…? ఫణీంద్రకుమార్