న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు(Supreme Court)కు కొత్తగా మరో అయిదుగురు జడ్జీలు వచ్చేశారు. ఇవాళ ఆ అయిదుగురు కొత్త జడ్జీలు ప్రమాణ స్వీకారం చేశారు. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య 37కు చేరకున్నది. ప్రస్తుతం ఒకే ఒక్క పోస్టు ఖాళీగా ఉంది. సుప్రీంకోర్టులో పెండింగ్ కేసుల సంఖ్య పెరగడం వల్ల .. కొత్త జడ్జీల నియామకం కోరుతూ మే 16వ తేదీన ఆర్డినెన్స్ జారీ చేశారు. సుప్రీం కోర్టులో సుమారు 93 వేల కేసులు ఉన్నట్లు తెలిసింది. ఇవాళ జడ్జీలుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో పంజాబ్-హర్యానా హైకోర్టు సీజే షీల్ నాగు, సీనియర్ న్యాయవాది వీ మోహన్ , బాంబే హైకోర్టు సీజే శ్రీ చంద్రశేఖర్, మధ్యప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ సచ్దేవ్, జమ్మూకశ్మీర్ అండ్ లడాక్ హైకోర్టు సీజే అరుణ్ పల్లి ఉన్నారు. సుప్రీంకోర్టు జడ్జీలు, న్యాయవాదులు, కుటుంబసభ్యులు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఏడాది చివరలో నలుగురు సుప్రీంకోర్టు జడ్జీలు రిటైర్కానున్నారు.