Hraish Rao | సిద్దిపేట, మే 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నామంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ నిర్మల్ సభలో పట్టపగలే పచ్చి అబద్ధాలు చెప్పారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్యారెంటీల అమలుపై తప్పుదోవ పట్టిచ్చినందుకు రాహుల్గాంధీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ తరువాతే ఓట్లు అడగాలని సూచించారు. ఆదివారం ఆయన సిద్దిపేటలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ‘హామీల అమలుపై రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు అబద్ధ్దం ఆడింది కాకుండా, రాహుల్గాంధీతో కూడా అబద్ధాలు అడిస్తున్నారు. ఇది చాలా తీవ్రమై న విషయం. నిర్మల్ సభలో రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. ఏ హామీలు అమలు చేశారో..? ఏ హామీలు అమలు చేయలేదో..? శ్వేతపత్రం విడుదలచేయాలి’ అని డిమాండ్ చేశారు. రేవంత్రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అయితే, రాహుల్గాంధీ అంతకంటే అబద్ధాల కోరు అని రుజువైందని చెప్పారు. ఆయన రాహుల్గాంధీ కాదు- రాంగ్గాంధీ అని నిరుపించుకున్నారని ఎద్దేవా చేశారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తున్నామని, ఏడాదికి రూ.30 వేలు మహిళల అకౌంట్లో వేస్తున్నామని రాహుల్గాంధీ అబద్ధం ఆడారు.
వేయని డబ్బులు వేస్తున్నామని చెప్పడం అంటే మహిళలను అవమాన పర్చడమే. ‘రాష్ట్రంలోని ఏ మహిళ అకౌంట్లోనైనా రూ.2,500 జమ అయ్యాయా? ఏడాదికి రూ.30 వేలు వస్తున్నాయా? రాహుల్గాంధీకి స్క్రిప్ట్ రాసిచ్చింది ఎవరు? రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నది ఎవరు?’ అని ప్రశ్నించారు. 18 ఏండ్లు నిండిన ప్రతి అక్కకు, చెల్లెకు విజ్ఞప్తి చేస్తున్నా.. రాహుల్గాంధీ వేస్తున్నామన్న డబ్బులు ఎటుపోయాయి? అవి ఎవరి అకౌంట్లో జమ అయ్యాయి? అవి మీ అకౌంట్లో ఎందుకు పడలేదో.. మీ దగ్గరికి ప్రచారానికి వస్తున్న ముఖ్యమంత్రి, మంత్రులను, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నిలదీయాలని పిలుపునిచ్చారు. నాలుగు నెలలకు సంబంధించిన రూ.10 వేలు ఎటు పొయినట్టు? దీనిపై ఎక్కడికక్కడ మహిళలు కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయాలని కోరారు. రాహుల్, రేవంత్.. ఇద్దరు తోడు దొంగలు కలిసి అబద్ధాలతో రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
హామీల అమలు బాధ్యత మీది కాదా?
గ్యారెంటీల అమలు బాధ్యత తమదేని ఎన్నికల ప్రచారంలో రాహుల్గాంధీ, సోనియాగాంధీ, ప్రియాంకాగాంధీలు చెప్పలేదా? అని హరీశ్రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటినా, 150 రోజులు అవుతున్నా ఆరు గ్యారెంటీలు అమలు కాలేదని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఆరా తీసి, దానిని సరిదిద్దాల్సింది పోయి రాహుల్గాంధీ కూడా దొంగలకు సద్ది కడుతున్నారని విమర్శించారు. ‘మీరు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? ఏ మొఖం పెట్టుకొని తెలంగాణ ఓట్లు అడుగుతున్నారు? హామీలు అమలు చేయకపోతే ఆ బాధ్యత మీది కాదా? అమలు అవుతున్నాయా? లేదా అని రివ్యూ చేయరా? పైగా అన్ని అమలు అవుతున్నాయని పచ్చి అబద్ధాలు ఆడటం ఎంత వరకు కరెక్ట్?’ అని ప్రశ్నించారు. గ్యారెంటీలకు గ్యారెంటీలుగా ఉండాల్సిన రాహుల్గాంధీ ప్రవర్తన చూస్తుంటే, కంచే చేను మేసిన చందంగా ఉన్నదని దుయ్యబట్టారు.
బహిరంగ చర్చకు సిద్ధమా?
‘రేవంత్రెడ్డి ఐదు గ్యారంటీలు అమలయ్యాయని చెప్తుంటే, రాహుల్గాంధీ ఆరు గ్యారెంటీలు అమలయ్యాయని అంటున్నారు. నేను మాత్రం ఒక్కటే అయిందని అంటున్నా. బషీర్బాగ్ ప్రెస్క్లబ్, లైవ్టీవీ డిస్కషన్.. ఎక్కడైనా చర్చకు సిద్ధం? రాహుల్ వస్తాడా? రేవంత్ వస్తాడా? ఎవరు వస్తారో రండి’ అని హరీశ్రావు సవాల్ విసిరారు. ఎకరానికి రూ.15 వేల చొప్పున ఏ రైతు ఖాతాలో పడ్డాయో చెప్పాలని కాంగ్రెస్ నేతలను నిలదీయాలని రైతులకు పిలుపునిచ్చారు. విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కార్డు ఏమైంది? అవ్వాతాతలకు నాలుగు వేల ఫించన్ ఎక్కడ అమలైంది? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అంటేనే కుట్ర, కపట నీతి అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వసనీయతను కోల్పోతున్నదని పేర్కొన్నారు.