రాజన్న సిరిసిల్ల, మే 5 (నమస్తే తెలంగాణ)/భీమదేవరపలి: ‘రాష్ట్రంలో ఎండలు మండుతున్నయ్. కాంగ్రెస్, బీజేపీల మోసపూరిత మాటలు వింటుంటే ప్రజల గుండెలు కూడా మండుతున్నయ్. కాంగ్రెసోళ్లు మార్పు.. మార్పు అని చెప్తే ప్రజలు ఆశపడి ఓట్లేసిండ్రు. కానీ, కరెంటు కష్టాలు, మంచినీళ్ల కష్టాలు తెచ్చారు. దవాఖాన్లకు పోతే ఇబ్బందులు పడే రోజులు తెచ్చారు. కాంగ్రెస్ తెచ్చిన మార్పు ఇదేనా?’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ఎన్నికల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, తప్పి కాంగ్రెస్కు ఓటేస్తే వాళ్ల అబద్ధాలకు ఆమోదం తెలిపినట్టవుతుందని, వాళ్ల మోసాలకు సద్దికట్టినట్టే అవుతుందని హెచ్చరించారు. హామీలు అమలు చేయకుండా మోసం చేసినా ప్రజలు తనకే ఓటు వేశారని రేవంత్రెడ్డి విర్రవీగుతారని చెప్పారు. ప్రభుత్వాల మెడలు వంచి అడగాలంటే బీఆర్ఎస్కు ఓటేసి భారీ మెజార్టీతో వినోదన్నను గెలిపించాలని కోరారు. ఆదివారం ఆయన కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్తో కలిసి చందుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు.
భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూరులో రోడ్షో నిర్వహించారు. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డితో కలిసి మెదక్ జిల్లా తూప్రాన్, రామాయంపేట, సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో నిర్వహించిన రోడ్షోల్లో పాల్గొన్నారు. ఆయా సభల్లో హరీశ్రావు మాట్లాడుతూ.. నాడు బీడీ కట్టలపై కాంగ్రెస్ పుర్రె గుర్తు పెడితే, బీజేపీ 12% జీఎస్టీ విధించి పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టిందని విమర్శించారు. బీడీలు చేసే అక్కాచెల్లెళ్లు ఆలోచించాలని, ఆ రెండు పార్టీల మోసాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ 24 గంటల కరెంటు ఇస్తే, ఇప్పుడు 11 గంటల కరెంటుతో మళ్లీ కాలిపోయే మోటర్లు చాలయ్యాయని చెప్పారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఒక్క మోటరు కూడా కాలిపోలేదని తెలిపారు. తిరగబడుతున్న జనాన్ని చూసి, ఎవరు ఓట్లేసేటట్టు లేరనే భయంతో రేవంత్రెడ్డి దేవుళ్ల మీద ఒట్టుపెడుతున్నాడని ధ్వజమెత్తారు. దుక్కిదున్నే సమయంలో ఇవ్వాల్సిన రైతుబంధును కల్లాలకు వడ్లు వచ్చినంక ఇవ్వడమేమిటని ఆగ్రహం వ్యక్తంచేశారు.
అయిదునెలలైనా రైతుబంధు ఇచ్చేందుకు చేతకాని ఈ దద్దమ్మలకు మనం ఓటెయ్యాల్నా? అని ప్రశ్నించారు. వడ్లకు, మక్కలకు ఇస్తానన్న రూ.500 బోనస్ కూడా ఇవ్వని దిక్కుమాలిన సర్కారని ధ్వజమెత్తారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదాని, అంబానీలను ప్రపంచ కుబేరులుగా చేసిందని హరీశ్రావు ధ్వజమెత్తారు. కార్పొరేట్ కంపెనీలకు మేలు చేసే పార్టీ, కర్షకులకు అన్యాయం చేసే పార్టీ బీజేపీ అని విమర్శించారు. గ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరలు, జీఎస్టీ పేరిట పప్పు, ఉప్పు, నూనెలు, కూరగాయలు అన్నింటి ధరలు పెంచిన బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలని నిలదీశారు. మన వికాసం కోసం వినోదన్నను గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. వినోదన్న తెలంగాణ ఉద్యమంలో పాల్గొని రాష్ట్ర సాధనలో కేసీఆర్కు కుడి భుజంగా పనిచేశాడని చెప్పారు. కొత్తపల్లి, మనోహరాబాద్ రైలుమార్గం, జాతీయ రహదారులు, కరీంనగర్కు స్మార్ట్సిటీ తెచ్చిన వినోదన్నను దీవించాలని కోరారు. ప్రశ్నించే గొంతును గెలిపిస్తే బల్లగుద్ది అడిగే హక్కు ఉంటుందని చెప్పారు.
అభివృద్ధి కావాలా? విధ్వంసం కావాలా? : వినోద్కుమార్
అభివృద్ధి అంటే బీఆర్ఎస్ అని, విధ్వంసం అంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలని, అభివృద్ది కావాలా? విధ్వంసం కావాలా? ప్రజలు ఆలోచించాలని కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ కోరారు. ఇచ్చిన హామీలను నెరవేర్చమంటే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా ఆ పార్టీ ఎంపీ బండి సంజయ్ చేసింది చెప్పలేకనే దేవుళ్ల పేరుతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో ఎల్కతుర్తి నుంచి సిద్దిపేట వరకు నేషనల్ హైవే కావాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తే ఇప్పుడు పనులు జరుగుతున్నాయని గుర్తుచేశారు. అభివృద్ధిని ఆకాంక్షించి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.