న్యూఢిల్లీ : పెద్ద ఎత్తున నగదు లావాదేవీలు నిర్వహించే వారికి ఆర్బీఐ కీలక అలర్ట్ను జారీ చేసింది. ఈ నెల 18న దేశవ్యాప్తంగా రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్టీజీఎస్) సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 17న సాధారణ కార్యకలాపాలు ముగిసిన తర్వాత 18న రాత్రి 00:00 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు 14 గంటల పాటు సేవలు నిలిచిపోనున్నట్లు ప్రకటించింది. ఆర్టీజీఎస్ సేవల విషయంలో భారీ స్థాయిలో అప్గ్రేడేషన్ జరుగుతోంది. డిజాస్టర్ రికవరీ టైమ్ని పెంచేందుకు టెక్నికల్ అప్గ్రేడ్ చేస్తున్నారు. దీంతో కొన్ని గంటల పాటు ఆర్టీజీఎస్ సేవల్ని నిలిపివేస్తున్నట్లు చెప్పింది. ఆర్బీఐ ఆర్టీజీఎస్ సేవలు నిలిచిపోయిన సమయంలో వినియోగదారులు నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ టాన్స్ఫర్(నెఫ్ట్) సేవలను వినియోగించుకోవచ్చని పేర్కొంది.
ఈ సేవలకు ఎటువంటి అంతరాయం ఉండదని, ఆర్టీజీఎస్ సేవలకు మాత్రమే ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకోవాలని సూచించింది. పేమెంట్స్ కోసం ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు కూడా వినియోగించుకోవాలనే విషయాన్ని వినియోగదారులకు తెలుపాలని ఆర్బీఐ బ్యాంకులకు సూచించింది. రూ.2 లక్షల కన్నా ఎక్కువ మొత్తంలో భారీగా డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేయడానికి లావాదేవీలు జరిపేందుకు ఆర్టీజీఎస్ ఉపయోగపడుతోంది. గతేడాది డిసెంబర్ నుంచి ఆర్టీజీఎస్ సేవలు 24 గంటల పాటు అందుబాటులోకి వచ్చాయి. గతంలో ఆర్టీజీఎస్ వేళలు పరిమితంగా ఉండేవి. భారతదేశంలో ఆర్టీజీఎస్ సేవలు 2004 మార్చి 26న ప్రారంభమయ్యాయి.