హైదరాబాద్ : తెలంగాణలో శుక్ర, శనివారాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తా ఏపీ పరిసర ప్రాం తాల్లో ఉపరితల ద్రోణి వ్యాపించి ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు కురిసే అవకాశం ఉందని చెప్పింది. పలుజిల్లాల్లో భారీ వర్షాలు కురిస్తాయని తెలిపింది. మరో వైపు రాష్ట్రంలో రుతుపవనాలు చురుకుగా ఉన్నాయి. దీని ప్రభావంతో జూలైలో సాధారణ వర్షం కానీ, అంతకంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
జూలై నుంచి సెప్టెంబర్ వరకు పసిఫిక్ మహాసముద్రంపై ప్రస్తుతం ఉన్న ఎల్నినో– సదరన్ అసిలేషన్ పరిస్థితులు అలాగే కొనసాగొచ్చని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా గురువారం రాత్రి హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాలో వర్షాలు కురిశాయి. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, వరంగల్ అర్బన్, రూరల్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, నల్గొండ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. పలు చోట్ల అక్కడక్కడ భారీ వర్షాపాతం నమోదైంది. పలు జిల్లాల్లో తేలిక పాటి జల్లులు కురిశాయి.