హైదరాబాద్: రాష్ట్రంలో లాక్డౌన్ నేపథ్యంలో పోస్టాఫీసుల్లో వినియోగదారుల సేవల సమయాలను తపాలా శాఖ కుదించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పెద్ద పోస్టాఫీసుల్లో కౌంటర్లు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, చిన్న పోస్టాఫీసుల్లో ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు పనిచేస్తాయని అధికారులు వెల్లడించారు. డెలివరీ సహా ఇతర సేవలు గతంలో మాదిరిగానే కొనసాగుతాయని స్పష్టం చేశారు.
లాక్డౌన్ దృష్ట్యా బ్యాంకుల పనివేళల్లో మార్పులు చేశారు. గురువారం నుంచి బ్యాంకులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలవరకూ పనిచేస్తాయి. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ సూచనల మేరకు కుదించిన పనివేళల్లో నగదు డిపాజిట్, విత్డ్రాయిల్, చెక్కుల క్లియరెన్స్, రెమిటెన్సులు, ప్రభుత్వ కార్యకలాపాలు మాత్రమే నిర్వహించనున్నట్లు స్టేట్లెవల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్ఎల్బీసీ) కన్వీనర్ క్రిషన్ శర్మ చెప్పారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటలవరకే ప్రజలకు లాక్డౌన్ నుంచి మినహాయింపు వున్నందున, రోజంతా తెరిచినప్పటికీ ఉపయోగం లేదన్న కారణంగా బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారి రామకృష్ణ తెలిపారు.
రాష్ట్రంలో కరోనా ఉధృతి నిలువరించడానికి ప్రభుత్వం నిన్నటి నుంచి లాక్డౌన్ అమలుచేస్తున్నది. దీంతో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు సాధారణ కార్యకలాపాలు కొనసాగించుకోవడానికి ప్రజలకు అవకాశం కల్పించారు. ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుంది. కేవలం అత్యవసర వస్తువులకు సంబంధించిన దుకాణాలు, హాస్పిట్లు, వ్యవసాయ సంబంధిత దుకాణాలు మాత్రమే తెరచి ఉంటాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి