న్యూఢిల్లీ, జూలై 8 : ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్వో) వ్యవస్థ కేంద్రీకృతమైన తర్వాత మొదటిసారిగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 8.25 శాతం వార్షిక వడ్డీని జూలై 15 నాటికి సుమారు 34 కోట్ల మంది సభ్యుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ బుధవారం ప్రకటించారు. దీనికి అంచనాగా రూ. 1.44 లక్షల కోట్లు అవసరమవుతాయని ఆయన చెప్పారు. గతంలో ఈపీఎఫ్వో వడ్డీ రేటును చాలా ముందుగానే ప్రకటించినప్పటికీ సభ్యుల ఖాతాల్లో ఆ వడ్డీ వాస్తవంగా జమ కావడానికి అక్టోబర్-నవంబర్ వరకు సమయం పట్టేదని ఆయన పేర్కొన్నారు.
సెంట్రలైజ్డ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్(సీఐటీఈఎస్) ప్రాజెక్ట్ కింద తన మొత్తం డాటా బేస్ను ఒక కేంద్రీకృత ప్లాట్ఫామ్కు తరలించడాన్ని ఈపీఎఫ్వో పూర్తి చేసిందని మాండవీయ తెలిపారు. ప్రతి ఫీల్డ్ ఆఫీస్ వేర్వేరు డాటాబేస్లను నిర్వహించే మునుపటి కేంద్రీకృత విధానం స్థానంలో సీఐటీఈఎస్ ప్రాజెక్ట్ ఆటోమేషన్, నియమ-ఆధారిత ప్రాసెసింగ్ ద్వారా ఈపీఎఫ్వోకు చెందిన సేవా పంపిణీని ఆధునీకరిస్తుందని ఆయన అన్నారు. సీఐటీఈఎస్ అమలుతో ఈపీఎఫ్వో ఇప్పుడు ఒకే జాతీయ డాటాబేస్ ఆధారంగా పనిచేస్తున్నదని, దీనివల్ల సేవా అభ్యర్థనలను ఒక నిర్దిష్ట ప్రాంతీయ కార్యాలయానికి పరిమితం చేయకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఏ అధికారిక కేంద్రం నుండైనా పరిష్కరించే వీలు కలుగుతున్నదని మంత్రి తెలిపారు.