ఆదిలాబాద్, జూలై 7 ( నమస్తే తెలంగాణ): రెవెన్యూ శాఖలోని భూ భారతి పోర్టల్ ఆపరేటర్లుగా పనిచేస్తున్న ఉద్యోగులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 8 నుంచి విధులకు హాజరుకావద్దంటూ ఆపరేటర్లకు తెలియజేసింది. దీంతో ఆ ఉద్యోగులు రోడ్డున పడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం భూముల యజమానులు, క్రయవిక్రయాల్లో పారదర్శకత పాటించేలా ధరణీ పోర్టల్ను అమల్లోకి తీసుకువచ్చింది. ఆ సమయంలో మండలాల్లోని తహసీల్ కార్యాలయాల్లో వీరు ధరణీ ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణీ పోర్టల్ను భూ భారతి పోర్టల్గా మారడంతో వీరు భూ భారతి ఆపరేటర్లుగా కొనసాగుతున్నారు. జిల్లాలో 21 మంది ఆపరేటర్లు 2018 నుంచి తొమ్మిది సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తుండగా, ప్రభుత్వం ప్రతి నెలా రూ.17,500 వేతనం ఔట్సోర్సింగ్ విధానంలో చెల్లిస్తున్నది. వీరు ఉద్యోగాలను ప్రభుత్వం ప్రతి ఆర్థిక సంవత్సరంలో రెన్యూవల్ చేస్తుండగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రెన్యూవల్ చేయకుండా నిలిపివేసింది.
జూనియర్ అసిస్టెంట్లకు బాధ్యతలు
రెవెన్యూ శాఖలో భూ భారతి ఆపరేటర్లను తొలగించగా వారి స్థానంలో ఇటీవల నియమితులైన జూనియర్ అసిస్టెంట్లకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. జిల్లాలోని మండల కేంద్రాల్లో తహసీల్ కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న వారి జాబితాను సిద్ధం చేయగా శిక్షణ తీసుకున్న తర్వాత వారు బాధ్యతలు తీసుకుని భూ భారతి పోర్టల్ విధులు నిర్వహించనున్నారు. ప్రభుత్వం భూ భారతి ఆపరేటర్లను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఆందోళన బాట పట్టారు. కొన్ని రోజులుగా విధులను బహిష్కరించిన ఆపరేటర్లు కలెక్టర్తో పాటు ఇతర అధికారులు కలిసి తమ సేవలు కొనసాగించాలని కోరారు. తొమ్మిది సంవత్సరాలుగా పనిచేస్తున్న తమను ఏకపక్షంగా తీసివేయడంతో తమ కుటుంబాలు రోడ్డున పడుతాయంటున్నారు. చిరు ఉద్యోగులుగా పనిచేస్తున్న భూ భారతి ఆపరేటర్లకు సంబంధించి 15 నెలలు వేతనాలను ప్రభుత్వం చెల్లించలేదు. వేతనాలు రాకపోవడంతో కుటుంబాల పోషణ కోసం తాము అప్పులు చేయాల్సి వచ్చిందని వారు అంటున్నారు. తమ ఉద్యోగాలను రెన్యూవల్ చేసి తమకు రావాల్సిన పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని చిరు ఉద్యోగులు కోరుతున్నారు.