నదుల్లో మృతదేహాలతో ప్రజల్లో భయం
వ్యాపించదన్న డబ్ల్యూహెచ్వో
న్యూఢిల్లీ, మే 12: గంగా, యమునా నదుల్లో కొవిడ్ రోగుల మృతదేహాలు కొట్టుకువస్తుండటంతో నదీ తీర గ్రామాలు, నదుల్లోని నీటిని తాగునీటికి వినియోగించే ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మృతదేహాల్లో ఉన్న వైరస్ నీళ్ల ద్వారా తమకు కూడా సోకుతుందేమోనని భయపడుతున్నారు. ఇక్కడ రెండు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకటి… మృతదేహం నుంచి వైరస్ ఇతరులకు సోకుతుందా? రెండోది.. నీళ్ల ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తుందా? చనిపోయినవారి నుంచి వైరస్ సోకుతుందన్న విషయంపై స్పష్టత లేదు. మృతదేహాల నుంచి వైరస్ సోకదని చాలా మంది శాస్త్రవేత్తలు చెప్తున్నారు. శరీరంలోని ద్రవాల ద్వారా వైరస్ సోకే ప్రమాదం ఉందని మరికొంత మంది చెప్తున్నారు. ఇక రెండో ప్రశ్న నీళ్ల ద్వారా వైరస్ వ్యాపిస్తుందా.. అంటే లేదని డబ్ల్యూహెచ్వో తెలిపింది. రోగి తుంపరల్లో వైరస్ జీవించి ఉన్నప్పుడు నీళ్ల ద్వారా ఎందుకు వ్యాపించదు అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనప్పటికీ నదులు, స్మిమ్మింగ్పూల్స్ ద్వారా వైరస్ సోకినట్టు ఇప్పటికైతే ఆధారాలు లేవు.