హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 1: కాకతీయ యూనివర్సిటీలోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ స్టడీ సెంటర్ ఆధ్వర్యంలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు ఉచిత కోచింగ్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు స్టడీ సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం తెలిపారు. పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైనందున.. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ గురించి స్టడీ సెంటర్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ పుల్లా శ్రీనివాస్ కీలక విషయాలు వెల్లడించారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారమ్లను స్టడీ సెంటర్లో అందజేయాలని ఆయన సూచించారు. ఆగస్టు 7వ తేదీలోగా అప్లికేషన్ సమర్పించాలని, గడువు ముగిసిన తర్వాత ఎలాంటి దరఖాస్తులు స్వీకరించబోమని ఆయన స్పష్టం చేశారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, కేటగిరీలకు చెందిన విద్యార్థులందరూ ఈ ఉచిత శిక్షణకు అర్హులని శ్రీనివాస్ వెల్లడించారు. విషయ పరిజ్ఞానం, అనుభవం ఉన్న నిపుణులైన అధ్యాపకులు పాఠాలు చెబుతారని ఆయన చెప్పారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు నిర్దేశిత గడువులోగా దరఖాస్తు చేసుకొని ఈ ఉచిత కోచింగ్ క్యాంప్ను వినియోగించుకోవాలని పుల్లా శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.