న్యూఢిల్లీ : ఢిల్లీలో భారీగా ఆక్సిజన్ కొరత ఉందని, ఉత్పత్తి ప్లాంట్ లేకపోతే ప్రాణవాయువు అందదా? అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో శుక్రవారం ప్రధాని పది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ ఢిల్లీలోని హాస్పిటళ్లలో ఆక్సిజన్ సంక్షోభాన్ని ఎత్తి చూపారు. ‘సార్.. మాకు మీ మార్గదర్శకత్వం అవసరం.
ఢిల్లీలో భారీగా ఆక్సిజన్ కొరత ఉంది. ఇక్కడ ఆక్సిజన్ ప్లాంట్ ఉత్పత్తి చేసే ప్లాంట్ లేకపోతే ప్రజలకు ఆక్సిజన్ లభించదా? దయచేసి ఢిల్లీకి ఉద్దేశించిన ఆక్సిజన్ ట్యాంకర్ మరొక రాష్ట్రంలో ఆగిపోయినప్పుడు నేను ఎవరితో మాట్లాడాలో సూచించండి’ అని అన్నారు. ‘సర్, దయచేసి ట్రక్కులు (ఆక్సిజన్ తీసుకెళ్లే ట్యాంకర్లు) ఆగిపోతే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఫోన్ చేయండి.. తద్వారా ఆక్సిజన్ ఢిల్లీకి చేరుకుంటుంది’ అని పేర్కొన్నారు. సంక్షోభాన్ని పరిష్కరించడానికి జాతీయ విధానానికి ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
అలాగే కొరతను తీర్చేందుకు పశ్చిమ బెంగాల్, ఒడిశా నుంచి వాయుమార్గంలో తరలించేందుకు వీలు కల్పించాలని కోరారు. సంక్షోభాన్ని పరిష్కరించేందుకు జాతీయ విధానాన్ని తీసుకురావాలని సూచించారు. ఇదిలా ఉండగా.. ప్రధానితో జరిగిన సమావేశాన్ని కేజ్రీవాల్ రాజకీయాలకు వేదికగా ఉపయోగించుకున్నారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఆరోపించాయి. కేంద్రం టీకాలను తన వద్ద ఉంచుకోదని, రాష్ట్రాలకు మాత్రమే పంపిణీ చేస్తుందని..ఇది తెలిసినా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించాయి. సమస్య పరిష్కారం పాటుపడకుండా రాజకీయాలు చేస్తూ బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.