న్యూఢిల్లీ : మహారాష్ట్ర విరార్లోని కొవిడ్ దవాఖానలో జరిగిన అగ్ని ప్రమాదంలో 13 మంది కొవిడ్ రోగులు మృతి చెందిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఘటనలో మృతి చెందిన వారికి పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50వేల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది. ఇదిలా ఉండగా.. ఘటనపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. కొవిడ్ రోగులు అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినందుకు బాధగా ఉందన్నారు. బాధిత కుటుంబానికి సంతాపం ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు.
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా విరార్లోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో శుక్రవారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన సమయంలో 90 మంది రోగులు ఉండగా.. 18 మంది ఐసీయూలో ఉన్నారు. ఏసీ యూనిట్లో పేలుడు జరగడంతో మంటలు చెలరేగాయని ఓ అధికారి తెలిపారు. ప్రమాదంలో ఐదుగురు మహిళలు, ఎనిమిది మంది పురుషులు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు.