NEET Paper Leak : వైద్యవిద్య కోర్సుల (Medical Courses) లో ప్రవేశాలకు నిర్వహించిన ‘నీట్- యూజీ ప్రవేశపరీక్ష 2026 (NEET UG-2026 Exam)’ లో ప్రశ్నపత్రం లీక్ (Paper Leak) కలకలం సృష్టిస్తోంది. పరీక్షకు ముందు రాజస్థాన్ (Rajasthan) లో పంపిణీ చేసిన మెటీరియల్తో పరీక్ష పత్రంలోని 600 మార్కుల ప్రశ్నలు పోలి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దాంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. దానిపై రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ (Rajasthan Special Operation) గ్రూప్ దర్యాప్తు చేపట్టింది. మే 3న జరిగిన పరీక్షలో వచ్చిన ప్రశ్నలను పోలిన సుమారు 140 ప్రశ్నలతో ఉన్న ఓ ప్రాక్టీస్ పేపర్ను అధికారులు వారు గుర్తించారు.
ఈ మెటీరియల్ రాజస్థాన్లోని సికార్లో పరీక్షకు రెండు రోజుల ముందు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. దీనిని విద్యార్థులకు రూ.20 వేల నుంచి రూ.2 లక్షల వరకు విక్రయించినట్లు గుర్తించామన్నారు. ఈ ప్రశ్నలు యాదృచ్ఛికంగా ఒకే మాదిరిగా ఉన్నాయా, లేదా ఎవరైనా పేపర్ లీక్ చేశారా..? అనే దానిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. అయితే పలు ప్రశ్నలలోని జవాబుల క్రమం కూడా ఒకేలా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆ ప్రాక్టీస్ పేపర్ కేరళలోని ఓ వైద్య కళాశాలలో చదువుతున్న ఎంబీబీఎస్ విద్యార్థికి చెందినదని తేలినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఆ విద్యార్థి మే 1న సికార్లోని తన స్నేహితుడికి ఈ మెటీరియల్ ఇచ్చాడని, ఆ తర్వాత అది పీజీ వసతిగృహాలు, కోచింగ్ నెట్వర్క్లు, కెరీర్ కౌన్సెలర్లు, పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు చేరిందని తెలిపారు. ఆ మెటీరియల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించిన 300 కు పైగా చేతిరాత ప్రశ్నలు ఉన్నాయన్నారు. ఈ ఘటనపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) స్పందిస్తూ.. నీట్ యూజీ 2026 కి సంబంధించి అవకతవకలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపింది.
పరీక్ష జరిగిన నాలుగు రోజుల తర్వాత ఈ సమాచారం అందిందని ఎన్టీఏ పేర్కొన్నది. ఆ వివరాలను సంబంధిత ఏజెన్సీలకు అందించామని అంది. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, దీన్ని పారదర్శకంగా పరిశీలించి పూర్తి వివరాలను వెల్లడిస్తామని తెలిపింది.