న్యూఢిల్లీ : కొవిడ్ వ్యాక్సిన్ ధరల్లో ఏకరూపత ఉండేలా కేంద్రం జాతీయ విధానాన్ని రూపొందించాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి శుక్రవారం డిమాండ్ చేశారు. అలాగే ఆక్సిజన్ సరఫరాకు వర్తింపజేయాలన్నారు. ఇటీవల ఓ కంపెనీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు హాస్పిటళ్లకు వ్యాక్సిన్ సరఫరాకు సంబంధించి రేట్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె స్పందించారు.
కరోనా వ్యాక్సిన్ ధర ఏకరీతిగా లేదని, కేంద్రం.. రాష్ట్రాలు, ప్రైవేటు హాస్పిటళ్లకు వేర్వేరు రేట్లను నిర్ణయించారని, ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకొని జాతీయ విధానాన్ని రూపొందించి, అమలు చేయాలని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. అలాగే వివిధ రాష్ట్రాలు, జాతీయ రాజధానిలోని పెద్ద హాస్పిటళ్లలో ఆక్సిజన్ కొరత దృష్ట్యా కేంద్రం పారిశ్రామిక, వాణిజ్య ప్రాంతాల్లో వాడకాన్ని నిలిపివేసి, ఆసుపత్రులకు సరఫరా చేయాలని సూచించారు. అత్యవసర ఆక్సిజన్, మందుల సరఫరాపై దృష్టి పెట్టాలని సూచించారు.