సూర్యాపేట, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర గురువారం సూర్యాపేట నుంచి బయల్దేరింది. సాయంత్రం 3.50 గంటలకు అర్వపల్లి, నాగారం, తిరుమలగిరి, జనగాం, ఆలేరు మీదుగా కేసీఆర్ భువనగిరికి వెళ్లగా జనం నీరాజనం పలికారు. దారిపొడవునా రైతులు, మహిళలు, వివిధ వర్గాల ప్రజలతోపాటు పార్టీ శ్రేణులు కేసీఆర్ కాన్వాయ్పై పూల వర్షం కురిపించారు. చేతులు ఊపి స్వాగతించారు. కేసీఆర్ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
బుధవారం సాయంత్రం మిర్యాలగూడ రోడ్ షో అనంతరం సూర్యాపేటకు వచ్చిన మాజీ సీఎం కేసీఆర్ పట్టణంలో రోడ్ షోలో పాల్గొన్నారు. రాత్రి జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి క్యాంప్ ఆఫీసుకు చేరుకొని బస చేశారు. గురువారం మధ్యాహ్నం మూడు గంటల వరకు క్యాంప్ ఆఫీసులోనే ఉన్న కేసీఆర్ దాదాపు గంటపాటు బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులతో కరచాలనం చేస్తూ అందరితో ఫొటోలు దిగారు. ఇక్కడ కేసీఆర్ను కలిసిన వారిలో మాజీ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్కుమార్, రవీంద్రకుమార్, భాస్కర్రావు, జడ్పీ చైర్పర్సన్ దీపికాయుగంధర్రావు, సూర్యాపేట, కోదాడ మున్సిపల్ చైర్పర్సన్స్ పెరుమాళ్ల అన్నపూర్ణ, సామినేని ప్రమీలారమేశ్ తదితరులు ఉన్నారు.