KTR | రాజన్న సిరిసిల్ల : తెలంగాణ ప్రభుత్వ పనితీరు పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నాలుగున్నర నెలల కాలంలో చిల్లర మాటలు.. ఉద్దెర పనులు ఇది తప్ప చేసిందేమీ లేదు అని కేటీఆర్ మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
నిన్న సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్లకు తన ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చినప్పుడు నేను ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ఆశించింది.. ప్రభుత్వం నుంచి ఏందంటే.. నాలుగు మంచి మాటలు, చేసిన తప్పుని సరిదిద్దుకునే విధంగా మాట్లాడుతారని ఆశించాను. కానీ ఈ సీఎం వైఖరి గత నాలుగున్నర నెలలుగా చిల్లర మాటలు.. ఉద్దెర పనులు ఇది తప్ప చేసిందేమీ లేదు. ఒక పిచ్చోడి చేతిలో రాయి పెట్టినట్లు అనిపిస్తుంది. కేసీఆర్కు ఉల్టా పని చేసే విధంగా రేవంత్ ప్రవర్తిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలను తీసేస్తాం అంటున్నాడు రేవంత్ రెడ్డి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్తగా 23 జిల్లాలను ఏర్పాటు చేశారు. కొన్ని జిల్లాలకు మహానుభావుల పేర్లు పెట్టాం. అదే విధంగా మొదట కొన్ని జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత స్థానిక ప్రజలు, స్థానిక నాయకులు పోరాటం చేసి సాధించుకున్న జిల్లాలు ఉన్నాయి. అందులో రాజన్న సిరిసిల్ల ఒకటి. ఆనాడు రాజన్న సిరిసిల్ల జిల్లా కోసం ప్రభుత్వంపై పోరాటం చేసి సాధించుకున్నాం అని కేటీఆర్ తెలిపారు.
అధికార వికేంద్రీకరణ జరిగిన తర్వాత ప్రభుత్వ సంక్షేమ పథకాలు చివరి వరకు అందాయి. ప్రజలకు లాభం జరిగింది. కానీ కేసీఆర్కు ఉల్టా చేస్తున్నారు రేవంత్ రెడ్డి. 3 వేల కోట్ల ఆర్డర్ల చీరలు ఇచ్చి చేనేతల బతుకు నిలబెట్టారు. చేనేతలకు కేసీఆర్ గౌరవాన్ని కల్పించారు. రేవంత్ వచ్చిన తర్వాత రంజాన్ తోఫా, బతుకమ్మ చీర, క్రిస్మస్ కానుక కట్ అయ్యాయి. కేసీఆర్ 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహాన్ని పెడితే దానికి రేవంత్ దండ వేయలేదు. నివాళులర్పించకుండా చేశారు.. అంబేద్కర్ను చెరలో పెట్టినట్టు రేవంత్ రెడ్డి అగౌరవపరిచాడు. నీ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. కేసీఆర్ నాయకత్వంలో ఏర్పాటైన కొత్త జిల్లాలను కచ్చితంగా కొనసాగించాలి. కొనసాగించకపోతే ప్రజా ఉద్యమం తప్పుదు. బీఆర్ఎస్ పార్టీనే నాయతక్వం వహిస్తుందని హెచ్చరిస్తున్నాం అని కేటీఆర్ తెలిపారు.
పార్లమెంట్కు ఒక జిల్లా ఉండాలని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. మరి 33 జిల్లాల్లో ఏ జిల్లాలు కొనసాగిస్తారు.. ఏ జిల్లాలు తొలగిస్తారో స్పష్టం చేయాలి. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కరీనంరగ్, రాజన్న సిరిసిల్ల జిల్లా ఉన్నాయి. ఈ రెండింటిలో ఏది ఉంచుతారో చెప్పాలి. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో జగిత్యాల, నిజామాబాద్ ఉన్నాయి. ఈ విషయంలో కూడా స్పష్టత ఇవ్వాలి. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలు ఉన్నాయి. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలు ఉన్నాయి. వీటిలో ఏ రెండు జిల్లాలు ఎత్తేస్తారో చెప్పాలి. ఇవాళ పరిపాలన పిచ్చోడి చేతిలో రాయి ఉన్నట్లు ఉంది. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా వికేంద్రీకరణ చేయాలి. ఇంకా కొత్త డివిజన్లు, మండలాలు మున్సిపాలిటీలు ఏర్పాటు చేయాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఇకనైనా చేసిన తప్పుకు చెంపలు వేసుకుని బుద్ది తెచ్చుకోవాలి రేవంత్. నేతన్నల ఆత్మహత్యలు ప్రారంభమయ్యాయి. పిచ్చి వాగుడు మానుకొని నేతన్నలకు ఆర్డర్లు ఇవ్వండి.. మీకు దమ్ముంటే 6 వేల కోట్ల ఆర్డర్లు ఇవ్వు.. కాటన్ పరిశ్రమకు ఊతమిచ్చే విధంగా చేయ్. నేతన్నల ఉసురు తగిలే విధంగా దిక్కుమాలిన రాజకీయాలు చేయడం బంద్ చేయ్. ఊసరవెల్లి రంగులు మార్చినట్టు.. రేవంత్ రెడ్డి తారీఖులు మారుస్తున్నాడు. రుణమాఫీ 9వ తేదీ అన్నాడు.. ఇప్పుడేమో దేవుళ్ల మీద ఒట్లు వేస్తూ రోజుకో తేదీ అంటున్నాడు అని కేటీఆర్ విమర్శించారు.