– క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారుల విచారణ
– వాస్తవాలు వివరించిన స్థానిక రైతులు
– కలెక్టర్కు సమగ్ర నివేదిక ఇస్తామన్న తాసీల్దార్ (డిప్యూటీ కలెక్టర్)
దమ్మపేట, జూలై 28 : దమ్మపేట మండల కేంద్రం పరిధిలోని సర్వే నంబర్ 273/1 లో ఉన్న వివాదాస్పద భూములను మంగళవారం దమ్మపేట తాసీల్దార్ అండర్ ట్రైనీ డిప్యూటీ కలెక్టర్) రెవెన్యూ సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ భూములపై యాజమాన్య హక్కులకు సంబంధించి ఇటీవల జిల్లా కలెక్టర్ కార్యాలయానికి అందిన దరఖాస్తుల నేపథ్యంలో, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు ఈ క్షేత్రస్థాయి విచారణ చేపట్టారు. వివాదాస్పద భూమిని పరిశీలించేందుకు అధికారులు వస్తున్నారన్న సమాచారంతో దమ్మపేట మండల కేంద్రానికి చెందిన పలువురు రైతులు విచారణ ప్రదేశానికి చేరుకున్నారు. దశాబ్దాలుగా ఈ భూములను గట్ల సర్వేశ్వరరావు, మల్లా కమల, జంగాల వెంకటేశ్వరరావు, సీనియర్ జర్నలిస్ట్ గోళ్ల వెంకటేశ్వర్లు, గోళ్ల సీతారావమ్మ, బొగ్గం శివ, బొగ్గం గ్రేసుమని తదితరులు సాగు చేసుకుంటున్నారని, వారే అసలైన హక్కుదారులని విచారణ అధికారుల ముందు స్థానిక రైతులు సాక్ష్యాలు చెప్పారు.
ఈ సందర్భంగా సాగులో ఉన్న రైతులు సైతం తమ వద్ద ఉన్న న్యాయపరమైన ఆధారాలు, రికార్డులను అధికారులకు సమర్పించారు. క్షేత్రస్థాయిలో భూమిని పరిశీలించి, రైతుల వద్ద ఉన్న పత్రాలను తీసుకున్న అనంతరం తాసీల్దార్ మాట్లాడారు. ఈ భూమికి సంబంధించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను, వివరాలను నమోదు చేసుకున్నామని ఆయన తెలిపారు. రైతులు అందజేసిన పత్రాలతో పాటు, ఇరువర్గాల రికార్డులను పారదర్శకంగా విచారించి జిల్లా కలెక్టర్కు వాస్తవాలతో కూడిన సమగ్ర నివేదికను అందజేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల గిర్దావర్, సర్వేయర్, గ్రామ పరిపాలనా అధికారి (వీఆర్ఓ) పాల్గొన్నారు.

దమ్మపేటలో వివాదాస్పద భూముల పరిశీలన