చెన్నై: కాంగ్రెస్ నేత రెండు రోజులుగా అదృశ్యమయ్యారు. అయితే ఆయన కాలిన మృతదేహం లభించింది. ఆయనకు చెందిన వ్యవసాయ భూమిలో దీనిని పోలీసులు గుర్తించారు. కాంగ్రెస్ నేత అనుమానాస్పద మృతిపై దర్యాప్తు కోసం ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. తమిళనాడులోని తిరునల్వేలి తూర్పు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడైన కేపీకే జయకుమార్ (Congress Leader Jeyakumar) గురువారం అదృశ్యమయ్యారు. ఆయన కుమారుడు ఆ మరునాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కాగా, జయకుమార్కు చెందిన వ్యవసాయ భూమిలో సగం కాలిన ఆయన మృతదేహాన్ని పోలీసులు శనివారం గుర్తించారు. ఉన్నత స్థాయికి చెందిన కొంత మంది వ్యక్తులు తనను బెదిరించడంతోపాటు ఆర్థికంగా మోసం చేసినట్లు ఆరోపించిన ఒక నోట్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ లేఖ ఆయనే రాశారా అన్నది స్పష్టం కాలేదు. అలాగే జయకుమార్ హత్యకు గురయ్యారా లేక ఆత్మహత్య చేసుకున్నారా అన్నది కూడా తెలియలేదు. ఈ నేపథ్యంలో అనుమానాస్పద మృతిపై దర్యాప్తు కోసం మూడు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.