RTC Bus | కిక్కిరిసిపోతున్న ఆర్టీసీ బస్సు ఎక్కడంతో ఓ ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోయాడు. అసలే ఎండకాలం ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. బస్సులో కెపాసిటీకి మించి జనాలు ఎక్కడంతో ఊపిరాడక మరణించాడు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో గురువారం ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్కు చెందిన బోగం సాంబయ్య (65) పనిమీద మెట్పల్లి వచ్చాడు. గురువారం తిరిగి నిజామాబాద్ వెళ్లేందుకు హుజూరాబాద్ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు (టీఎస్ 02యూసీ5946) ఎక్కాడు. అయితే బస్సులో సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఎక్కారు. అసలే ఒకవైపు ఎండ వేడిమితో ఉక్కబోత ఉండగా.. మరోవైపు బస్సులో కెపాసిటీ మించి ప్రయాణికులు ఎక్కడంతో సాంబయ్య ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. వెంకట్రావుపేట సమీపం వరకు వెళ్లకముందే ఊపిరాడక అస్వస్థతకు గురయ్యాడు. సాంబయ్య పరిస్థితిని గమనించిన తోటి ప్రయాణికులు అప్రమత్తమై బస్సును పక్కకు ఆపించారు. అంబులెన్స్ ద్వారా మెట్పల్లి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అయితే అప్పటికే సాంబయ్య మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.