హైదరాబాద్ : దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పైడి జైరాజ్ తెలంగాణకు మాత్రమే కాక, దేశం గర్వించదగ్గ గొప్ప నటుడని క్రీడా, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన ప్రముఖ బాలీవుడ్ నటుడు పైడి జైరాజ్ 112 వ జయంతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జయరాజ్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రానికి చెందిన వైతాళికులను, కవులను, కళాకారులను, సాహితీవేత్తలను, మేధావులను, పోరాట యోధుల సేవలను గుర్తించి వారి జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు చెందిన సంస్కృతి, సాంప్రదాయాలను నిర్లక్ష్యం చేశారన్నారు.
దేశం గర్వించదగ్గ గొప్ప నటుడు పైడి జైరాజ్ కరీంనగర్ నుంచి సినిమా హీరో కావాలనే లక్ష్యంతో బొంబాయి వెళ్లారు. అప్పటి మూకీ సినిమాల కాలం లోనే నటుడుగా ప్రస్థానం ప్రారంభించి, ఆ తర్వాత టాకీ సినిమాలలో కూడా నటించి భారతీయ వెండి తెరపై మొదటి యాక్షన్ హీరో గా పేరు పొందారని ప్రశంసించారు.పైడి జైరాజ్ సేవలకు గుర్తుగా రవీంద్ర భారతిలోని ప్రివ్యూ థియేటర్కు పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ గా పేరు పెట్టి గౌరవిస్తున్నామని గుర్తు చేశారు.
ఈ థియేటర్ ఇప్పుడు నవతరం సినీ దర్శకులు, రచయితలు, నటులకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని, షార్ట్ ఫిలింలు ప్రదర్శించడం కోసం ఏర్పడ్డ ఒకే ఒక థియేటర్గా దేశం మొత్తం మీద ప్రత్యేకతను సాధించిందని అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం కళాకారులకు భవిష్యత్లో ఇచ్చే అవార్డులకు పైడి జైరాజ్ పేరుతో ఇవ్వడానికి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.
అలాగే తెలంగాణలో వందలాది మంది యువతీ యువకులు నాటకం, సినిమా రంగాలలో ప్రతిభను ప్రదర్శించు కోవాలనే ఆశతో ఉన్నారు. దీనికి సంబంధించిన శిక్షణ కోసం పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ కు అనుబంధంగా భాషా సాంస్కృతిక శాఖ సారథ్యంలో ఒక యాక్టింగ్ కోర్సును నిర్వహించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేష్, మంచిర్యాల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
వాగులో చిక్కుకున్న గ్యాస్ సిలిండర్ వాహనం..ఒడ్డుకు చేర్చిన పోలీసులు
Gulab Cyclone |బూచినెల్లి -ఘనపూర్ మధ్య రాకపోకలు బంద్
IPL 2021 | వార్నర్ పనైపోయినట్లేనా.. తుది జట్టు ఎంపికపై కోచ్ రియాక్షన్ ఇదీ!