నిజామాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాలనూ గులాబ్ తుఫాను ముంచేస్తోంది. గులాబ్ తుఫాన్ ప్రభావంతో నిజామాబాద్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిశాయి. దీనికితోడు ఎగువ మహారాష్ట్ర నుంచి కూడా భారీగా వరదనీరు గోదావరి నదిలో వచ్చి చేరుతోంది. ఫలితంగా మంజీరా నదిలో ప్రవాహం ఉధృతంగా కనిపిస్తోంది.
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి ఉగ్రరూపం చూపిస్తోంది. తెలంగాణ మహారాష్ట్రలను కలిపే అంతర్రాష్ట్ర బ్రిడ్జిని కూడా గోదావరి ప్రవాహం ముంచేయడంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికే గోదావరి నదీ పరివాహక ప్రాంతంలోని చాలా పంట పొలాలు వరద నీటిలో మునిగిపోయాయి.