ధర్మారం : కాళేశ్వరం ప్రాజెక్టు అనుబంధ లింక్ -2 ఎల్లంపల్లి ప్రాజెక్టు ( Yellampalli Project ) ద్వారా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని నంది పంప్ హౌస్ ద్వారా గోదావరి జలాల ( Godavari Water ) ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర నీటిపారుదల శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బుధవారం మధ్యాహ్నం నుంచి ఇక్కడి పంపు హౌస్ నుంచి నీటి ఎత్తిపోతల ప్రక్రియ మొదలుపెట్టిన విషయం తెలిసిందే.
గురువారం కూడా నీటి ఎత్తిపోతలు కొనసాగాయి.1,4,5,6 మోటార్ల ద్వారా నీటిని పంపింగ్ చేస్తున్నారు. ఒక్కో మోటార్ ద్వారా 3,150 క్యూసెక్కుల చొప్పున మొత్తం 4 మోటార్ల ద్వారా 12,600 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేసి నంది రిజర్వాయర్ లోకి ఎత్తిపోస్తున్నారు.
అనంతరం అదే పరిమాణంలో నంది రిజర్వాయర్ క్రష్ గేట్ల ద్వారా జలాలు ఏడో ప్యాకేజీ జంట సొరంగాల ద్వారా కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్ లోకి వెళుతుంది. ఆ పంప్ హౌస్ లోని నాలుగు బహుబలి మోటార్లను ఆన్ చేసి అక్కడ నుంచి వరద కాలువ ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి నీటిని తరలిస్తున్నారు.