KCR | ఈ రాష్ట్రం మీది.. భవిష్యత్తు మీది.. ఆలోచించి ఓటు వేయాలి తప్ప ఆగమాగం వేయవద్దని యువ సోదరులకు బీఆర్ఎస్ అధినేత సూచించారు. గుడ్డిగా ఓటు వేయడం కాదు.. ఎవరు గెలిస్తే మంచిదని ఆలోచన చేయాలని హితవు పలికారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాలలో కేసీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. మోదీది గ్యాస్ పురాణమే తప్ప ఎవరికీ ఏం చేయడని అన్నారు. మనకు న్యాయం జరగాలంటే బీఆర్ఎస్ ఎంపీలే ఉండాలని తెలిపారు. బీఆర్ఎస్ బిడ్డలు అయితేనే పేగులు తెగే దాకా కొట్లాడతరు తప్ప.. ఎవరూ కొట్లాడరని స్పష్టం చేశారు.
బీజేపీకి, కాంగ్రెస్కే పోటీ ఉంది.. బీఆర్ఎస్కు ఎంపీలు ఎందుకు అని కొందరు మాట్లాడుతున్నారని కేసీఆర్ గుర్తు చేశారు. బీజేపీకి నలుగురు ఎంపీలు గెలిచి.. నాలుగు రూపాయలు అయినా తెచ్చిండ్రా.. ఏమైనా అభివృద్ధి చేసిండ్రా అని ప్రశ్నించారు. వీళ్లకు ఎందుకు ఓటేయ్యాలని అడిగారు. మోదీ చెప్పింది జరగదు.. ఎంపీ గెలిచి ఏం చేయరని అన్నారు. రాష్ట్రంలో ఒక కేంద్ర మంత్రి ఉంటే ఐదు రూపాయల అభివృద్ధి జరగదని అన్నారు. మోదీ ప్రభుత్వం అన్నీ ఝూటా వాగ్ధానాలు అని విమర్శించారు. మోదీ ప్రభుత్వం సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అని నినాదమిచ్చిందని.. ఏమైనా జరిగిందా అని కేసీఆర్ ప్రశ్నించారు. ఏం కాలేదు కానీ సబ్ కా సత్యనాశ్ అయ్యిందని విమర్శించారు. మొత్తం మందిని మోదీ ముంచేశాడని ఆరోపించారు. మోదీది గ్యాస్ పురాణమే తప్ప.. ఈ దేశంలో ఎవరికీ ఏం చేయలేదు.. చేయడు కూడా అని అన్నారు. అందుకే ప్రజలు ఆలోచన చేయాలని సూచించారు.
ఆనాడు వరద కాల్వను రిజర్వాయర్ చేసుకుంటే.. 10 నెలల పాటు కాకతీయ కాల్వ నడిస్తే.. బ్రహ్మాండంగా వడ్లు పండినయని అన్నారు. మూడు కోట్ల టన్నుల వడ్లు పండించినం. వాటిని కొనమని అంటే మోదీ కొనలేదని అన్నారు. అప్పుడు అందరం ఢిల్లీలో ధర్నా చేసినం అని గుర్తు చేశారు. యాసంగి వడ్లు కొద్దిగా నూకలు అయితయి అంటే.. మీ తెలంగాణ ప్రజలే నూకలు తినండి అని మోదీ అన్నారని గుర్తు చేశారు. నూకలు తినమన్న నూకరాజు.. ఈ ప్రధాని మోదీ అని ఎద్దేవా చేశారు. ఈయనకు మళ్లీ ఓటు వేయాలా? దేనికోసం ఓటు వేయాలనేది ఆలోచించుకోవాలని ప్రజలను కోరారు. యువ సోదరులారా.. ఈ రాష్ట్రం మీది.. భవిష్యత్తు మీది.. ఆలోచించి ఓటు వేయాలి తప్ప ఆగమాగం వేయద్దని సూచించారు. గుడ్డిగా ఓటు వేయడం కాదు.. ఎవరు గెలిస్తే మంచిదని ఆలోచన చేయాలని హితవు పలికారు.
మనకు ఉన్నది ఒక్కటే గోదావరి.. ఈ గోదావరిని కూడా తమిళనాడుకు తీసుకుపోతా.. కర్ణాటకకు తీసుకుపోతా అని నరేంద్ర మోదీ అంటున్నాడని కేసీఆర్ తెలిపారు. బీజేపీ ఎంపీలు గెలిస్తే చేతులు కట్టుకుని నిలబడతారు తప్ప.. మోదీ ముందు మాట్లాడతారా? అని ప్రశ్నించారు. అదే బీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే పార్లమెంటులో దద్దరిల్లేలా కొట్లాడతారని స్పష్టం చేశారు. మీ కండ్ల ముందే మీ గోదావరిని ఎత్తుకుని పోతా అని నరేంద్రమోదీ అంటుంటే.. ఈ ముఖ్యమంత్రి సప్పుడు చేయడం లేదన్నారు. మరి గోదావరిని ఎవరు కాపాడాలి? బీజేపీ ఎంపీలు గెలిస్తే మాట్లాడతారా? కాంగ్రెసోళ్లు మాట్లాడతారా? అని ప్రశ్నించారు. మూతి ముడుసుకుంటరు.. చేతులు ముడుసుకుంటరు తప్ప ఏమీ మాట్లాడరని అన్నారు. ఇవాళ మన గోదావరి నీళ్లు మనకు దక్కాలన్నా.. మన కృష్ణా నీళ్లు మనకు రావాలన్నా.. మనకు న్యాయం జరగాలన్నా కచ్చితంగా బీఆర్ఎస్ ఎంపీలే ఉండాలని అన్నారు. బీఆర్ఎస్ బిడ్డలు అయితేనే పేగులు తెగే దాకా కొట్లాడతరు తప్ప ఎవరూ కొట్లాడరని స్పష్టం చేశారు.
‘ జగిత్యాలలో చాలామంది రచయితలు, మేధావులు, రమణయ్య సర్ లాంటి పెద్దలు ఉన్నారు. మీ అందరికి దండం పెట్టి ఒక్కటే చెబుతున్నా.. తెలంగాణను తెచ్చి ఎంత బాగు చేసిన్నో మీ కండ్లారా చూసిండ్రు. ఇవాళ నా కండ్ల ముందటనే తెలంగాణ ఆగమవుతుంటే పిడికిలి బిగించి మళ్లీ పోరాటానికి వచ్చిన. చేజేతులా గోదావరి నీళ్లు పోగొట్టుకోవద్దు. మన తెలంగాణ హక్కులు పోగొట్టుకోవద్దు. మన నిధులు మనం తెచ్చుకోవాలని జగిత్యాలలో ఉండే రచయితలు, మేధావులు, విద్యావంతులను కోరుతున్నా.’ అని కేసీఆర్ అన్నారు.