రాష్ట్ర ప్రభుత్వం మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తూ ఖజానా నింపుకుంటున్నది. తాగుబోతుల రాష్ట్రంగా తయారుచేస్తున్నది.
– అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్
సాగించిన ప్రచారం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోగా రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్షాపులను రద్దు చేస్తాం.
– కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో హామీ
Telangana | హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బెల్ట్షాపుల రద్దుపై రేవంత్రెడ్డి ప్రభుత్వం ఐదు నెలలు గడుస్తున్నా నోరు మెదపడం లేదు. పైగా ఈ ఏడాది మద్యం అమ్మకాల ద్వారా గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ.45 వేల కోట్ల మేరకు ఆదాయం పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ మేరకు ఎక్సైజ్శాఖతో జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులకు దిశా నిర్దేశం చేసినట్టు సమాచారం. వాస్తవానికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పాలనలో సంపద గణనీయంగా పెరిగింది. పదేండ్లలో జరిగిన అభివృద్ధితో తలసరి ఆదాయం రెట్టింపయ్యింది. కేసీఆర్ ప్రభుత్వం గుడుంబా తయారీ, అమ్మకాలపై ఉక్కుపాదం మోపింది. ఫలితంగా కల్తీసారా మరణాలు ఆగిపోయాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ఏటికేడు పెరిగాయని, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఎవరినీ ప్రోత్సహించలేదని విశ్లేషకులు చెప్తున్నారు. కానీ, మీడియాలోని ఒక వర్గం ఈ పరిణామాలను కప్పిపుచ్చి మద్యం అమ్మకాలను బూతద్దంలో పెట్టి చూపించిందని, కాంగ్రెస్, ఇతర పార్టీల నేతలు ఇదే ప్రచారం చేస్తూ ప్రజల్లోకి తప్పుడు భావనను తీసుకెళ్లారన్నారు.
తాము అధికారంలోకి వస్తే, మద్యం అమ్మకాలను నియంత్రిస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు మద్యం అమ్మకాలపై వచ్చే నిధులపైనే ఆధారపడిందనే విమర్శలొస్తున్నాయి. అలవిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. వాటిని అమలు చేసేందుకు నిధుల వేటలో పడింది. వాణిజ్యపన్ను తర్వాత అత్యధికంగా డబ్బులు కురిపించే కల్పతరువుగా ఎక్సైజ్శాఖను గుర్తించింది. ఈ నేపథ్యంలోనే మద్యం అమ్మకాలను పెంచి, ఆదాయం దండుకోవాలని ప్రణాళిక రచించినట్టు సమాచారం. లిక్కర్, బీరు, వ్యాట్, ఇతర లైసెన్స్ల ఫీజుల నుంచి ఎక్సైజ్ శాఖకు ప్రతినెలా దాదాపు రూ.మూడు వేల కోట్ల ఆదాయం వస్తుంది. మద్యం, ఇతర వ్యాట్లు కలుపుకొని ఎక్సైజ్ శాఖకు 2022లో రూ.32 వేల కోట్లు, 2023లో రూ.35 వేల కోట్లు ఆదాయం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ లక్ష్యాన్ని ఏకంగా రూ.45 వేల కోట్లకు పెంచినట్టు సమాచారం. ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే రూ.902.28 కోట్ల బీర్లు అమ్మారు. 2023 ఏప్రిల్లో అమ్మింది రూ.764 కోట్లు మాత్రమే. నిరుటికంటే ఈసారి 19శాతం బీర్ల అమ్మకాలు పెంచారు. అన్ని డిపోల్లో ఒక్క ఏప్రిల్ నెలకు 2.28 లక్షల కేసుల బీర్లను నిల్వ ఉంచారు. దీనిని బట్టే మద్యం అమ్మకాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏ స్థాయిలో ఆధారపడిందో అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు చెప్తున్నారు. ‘తెలంగాణను తాగుబోతు రాష్ట్రంగా చేశారు’ అంటూ విమర్శలు గుప్పించిన సీఎం రేవంత్రెడ్డి.. ఇప్పుడెందుకు మౌనం పాటిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్రంలో 60 వేలకుపైగా బెల్ట్షాపులున్నాయని, తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోగా రద్దు చేస్తామని పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే 2023 నవంబర్ 17న విడుదల చేసిన అభయహస్తం మ్యానిఫెస్టోలో సైతం ఇదే అంశాన్ని చేర్చారు. అధికారంలోకి వచ్చి ఐదు నెలలైనా కనీస చర్యలు లేవు. గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు పెరిగాయని ప్రజలు ఆందోళన బాటపడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండ లం పల్సి, కోసాయి గ్రామాల్లో బెల్ట్షాపులపై మహిళలు దాడులు చేసి, మద్యాన్ని ధ్వంసం చేశారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లోనూ ఇలాంటి పరిస్థితే కనిపిస్తున్నది.
ఎక్సైజ్ ఆదాయం పెరగాలన్న ప్రభుత్వ ఆదేశం మేరకు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు రోజూ మద్యం అమ్మకాలపై సమీక్షలు చేస్తున్నారు. మద్యం ఉత్పత్తి పెంచి ఎక్కడా ‘నోస్టాక్’ బోర్డులు లేకుండా చర్యలు తీసుకోవాల ని డిస్టలరీ, బ్రూవరీలకు అంతర్గతంగా ఆదేశా లిస్తున్నారు. కిందిస్థాయి సిబ్బందికి పైస్థాయి అధికారులు టార్గెట్లు ఇచ్చినట్టు సమాచా రం. ప్రస్తుతం ప్రతినెల 30 లక్షల కేస్లకుపైగా మద్యం అమ్మకాలు జరుగుతుండగా, దీనిని మరింత పెంచే ప్రయత్నాల్లో అధికారులు ఉన్నారు. నాడు బెల్ట్, మద్యం అమ్మకాలపై గ గ్గోలు పెట్టిన ఒక వర్గం మీడియా ఇప్పుడు స్పందించకపోవడం గమనార్హం. సోషల్ మీడియా సైతం మౌనం దాల్చింది.
రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలని ఆబ్కారీ కమిషనర్ శ్రీధర్ ఆదేశించారు. హైదరాబాద్లోని ఆబ్కారీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం అసిస్టెంట్ కమిషనర్లు, డీసీలు, డీఈపీలతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. నాటుసారాను మూడు నెలల్లో తుదముట్టించాలని ఆదేశించారు. ఎన్నికల సమయంలో చాలా ప్రాంతాల్లో ఎన్డీపీఎల్ వచ్చిందని, తద్వారా ఎక్సైజ్శాఖ ఆదాయం తగ్గుతున్నదని, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిఘాపెట్టి ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే లిక్కర్ను అరికట్టాలని చెప్పారు. వేసవిలో బీరు స్టాక్ లేదనే వార్తలు వస్తున్నాయని, రికార్డుల పక్రారం పరిశీలిస్తే గత ఏడాది కంటే ఎకువగానే బీరు నిల్వలు ఉన్నన్నాయనిచెప్పారు. నాటుసారా తయారీ ని తుదముట్టించాలని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్రెడ్డి చెప్పారు. ఆగస్టునాటికి పూర్తిగా గుడుంబాను నిర్మూలించడానికి ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు.