వేములవాడ : వేములవాడ రాజన్న ఆలయం ( Vemulawada Temple ) లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోమవారం ఆకస్మిక తనిఖీలు ( Vigilance inspections ) నిర్వహించారు. ఇద్దరు సీఐలతోపాటు , ఒక తహసీల్దార్, అధికారులతో కూడిన పదిమంది బృందం మూడు బృందాలుగా ఏర్పడి ఆరు గంటలుగా సోదాలు చేస్తున్నారు.
ప్రధానంగా ఆరోపణలు వచ్చిన విచారణ కార్యాలయం, గదుల నిర్వహణ, లీజులు, అన్నదానం, గోదాం, లడ్డు ప్రసాదం, పీఆర్వో కార్యాలయం తదితర విభాగాల్లో రికార్డులను పరిశీలిస్తున్నారు. లోతైన విచారణ జరిపేందుకు పలు రికార్డులను స్వాధీనం కూడా చేసుకున్నట్లు తెలిసింది. ఒక్కసారిగా విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించడంతో ఆలయ అధికారులు ఉలిక్కిపడ్డారు.
అయితే రాత్రి వరకు తనిఖీలు నిర్వహించే అవకాశం ఉండగా ఏదైనా విభాగం మిగిలితే మరుసటి రోజు కూడా నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.