అసలే పరిపాలనా అనుభవం లేదు..! దానికితోడు రాజకీయ కక్ష..! అలవిగాకపోయినా ఇచ్చిన హామీలు..! అమలు చేయాల్సిన అనివార్యత..! అమలు చేయలేని వైఫల్యం నుంచి తప్పించుకోవాలన్న ఆతృత! తప్పించుకోలేని అశక్తత..! అన్నీ తనకు తెలుసనే అతిశయం..! మంత్రివర్గ సహచరులనూ విశ్వాసంలోకి తీసుకోలేని అభద్రత.. వెరసి అధికార యంత్రాంగంపై అపరిమితమైన ఒత్తిడి! ఆర్భాటపు ప్రకటనలు.. హడావుడి నిర్ణయాల మధ్య అధికారులు సతమతమవుతున్నారు. పూటకో డెడ్లైన్తో విభాగాధిపతులు బెంబేలెత్తుతున్నారు. తమ అవగాహనకూ పైనుంచి ఆదేశాలకూ మధ్య పొంతన కుదరక గందరగోళపడుతున్నారు. అట్లా కాదని చెప్పలేక.. అలా అని అమలు చేయలేక.. నడిమిట్ల నలిగిపోతున్నారు.
CM Revanth Reddy | హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీరుతో వివిధ శాఖల అధికారులు అభద్రతాభావంతో సతమతం అవుతున్నట్టు సచివాలయ వర్గాలు చెప్తున్నాయి. భవిష్యత్తును అంచనా వేయకుండా దూకుడుగా నిర్ణయాలు తీసుకోవడం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సాధ్యాసాధ్యాలు అంచనా వేయకుండా ఆర్భాటంగా ప్రకటించడం, తానే డెడ్లైన్లు పెట్టి ఆలోగా అన్నీ జరిగిపోవాలని ఆదేశించడం వంటి పరిణామాలతో విభాగాధిపతుల నుంచి కిందిస్థాయి అధికారుల వరకు అందరూ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నట్టు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ విషయం ముఖ్యమంత్రికి ఎలా చెప్పాలో తెలియక తర్జనభర్జన పడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, అంచనాలు, సాధ్యాసాధ్యాలు పట్టించుకోకుండా హామీలు ఇవ్వడం పరిపాటి. కానీ, అధికారంలో ఉన్నవారు నిర్ణయాలు ప్రకటించే ముందు.. ఆయా శాఖల అధికారులు, నిపుణులతో సంప్రదించి, ఆదాయ వ్యయాలను పరిగణనలోకి తీసుకొని, సాధ్యాసాధ్యాలను అంచనావేసి స్పష్టమైన ప్రణాళిక రూపొందించుకున్న తర్వాత ముందుకెళ్లాల్సి ఉంటుంది. కానీ, సీఎం రేవంత్రెడ్డి మాత్రం ఇలాంటి కసరత్తు ఏదీ చేయకుండానే, ఫలానా తేదీలోగా అమలు చేస్తామంటూ ప్రకటనలు ఇస్తున్నారని, డెడ్లైన్లోగా అమలు చేయాలంటూ తమను ఆదేశిస్తున్నారని చెప్తున్నారు. దీనికి రుణమాఫీని ఒక ఉదాహరణగా చూపిస్తున్నారు. మరికొన్ని విషయాల్లో ముందు వెనుక ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకొని తమను ఇరుకున పెడుతున్నారని, ముందుకు, వెనక్కు వెళ్లలేని పరిస్థితి తెస్తున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వంటి వ్యవహారాలు ఇందుకు నిదర్శనమని చెప్తున్నారు. దీంతో ఈ విషయాలన్నీ సీఎంకు ఎలా సర్దిచెప్పాలో తెలియక అధికారులు సతమతం అవుతున్నారట. విపరీతమైన ఒత్తిడి కారణంగా కొందరు అధికారులు అనారోగ్యం పాలవుతుంటే, మరికొందరు సెలవుల్లో వెళ్లిపోవాలని ఆలోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది.
సీఎం రేవంత్రెడ్డి చేసే ఆర్భాటపు ప్రకటనలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒత్తిడి తమపై పడుతున్నదని ఆర్థికశాఖ వర్గాలు వాపోతున్నాయి. ఉదాహరణకు ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం ఏకంగా ఒట్టు మీద ఒట్టు వేశారని గుర్తుచేస్తున్నారు. రుణమాఫీకి దాదాపు రూ.40 వేల కోట్లు అవసరమని, ఈ నిధులు ఎక్కడి నుంచి తెస్తామో కనీసం సమీక్షించకుండా హామీ ఇచ్చేశారని చెప్పుకుంటున్నారు. ఆలోగా జరిగిపోవాలని తమను ఆదేశిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రుణమాఫీ కోసం కార్పొరేషన్ ఏర్పాటు కూడా సాధ్యం కాదని చెప్తున్నారు. రాష్ట్ర రుణ పరిమితి ఏడాదికి రూ.55 వేల కోట్ల లోపేనని, ఆఫ్ బడ్జెట్ రుణాలను కూడా ఎఫ్ఆర్బీఎం రుణం కిందే పరిగణిస్తున్న నేపథ్యంలో అదనంగా రుణం రాదని స్పష్టం చేస్తున్నారు. రుణమాఫీ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసినా రూ.40 వేల కోట్ల రుణం సాధ్యం కాదని తేల్చిచెప్తున్నారు. ఒకవేళ బ్యాంకులు ఇచ్చినా, మిగతా రూ.12 వేల కోట్లతో ప్రభుత్వం నడవడం అసాధ్యమని అంటున్నారు. దీనికి తోడు వానకాలం పంట నుంచి అంటే రానున్న డిసెంబర్ నుంచి క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పారని, దీనికి మరో రూ.7,500 కోట్ల వరకు అవసరమని వివరిస్తున్నారు. రాష్ర్టానికి వచ్చే ఆదాయం తగ్గుతున్న సమయంలో.. ఉద్యోగుల జీతభత్యాలు, సంక్షేమ పథకాలకే కనాకష్టంగా ఉన్నదని అంటున్నారు. దీనికి అదనంగా 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కు గ్యాస్ సిలిండర్ వంటి పథకాలకు నిధులు సర్దడం తలకు మించిన భారంగా తయారైందని చెప్తున్నారు. ఇలాంటి సమయంలో కొత్త ప్రకటనలు చేసి ‘ఎలాగైనా చేయాల్సిందే’ అంటూ హుకూం జారీ చేయడంపై ఆర్థిక శాఖ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.
ఎన్నికలకు ముందు ధరణి పోర్టల్ను కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద బూచిగా చూపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ధరణి పునర్నిర్మాణం కోసం ప్రత్యేకంగా కమిటీని నియమించింది. 5 నెలలుగా ఆ కమిటీ తేల్చిందేమీ లేదని అధికారులు చర్చించుకుంటున్నారు. కమిటీ వేసినప్పటి నుంచి తమపై ప్రజల నుంచి ఒత్తిడి పెరిగిందని వాపోతున్నారు. ధరణిపై ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో ఇప్పటివరకు స్పష్టత లేదని చెప్తున్నారు. వాస్తవానికి ధరణిపై ప్రభుత్వం రాజకీయ కోణంలో తప్ప.. ప్రజాకోణంలో పనిచేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఎన్నిరకాల భూ సమస్యలున్నాయి? వాటి పరిష్కారానికి తాత్కాలిక, శాశ్వత చర్యలేంటి? అనే కోణంలో కాకుండా.. గత ప్రభుత్వాన్ని ఏ విధంగా తిట్టొచ్చు అనే కోణంలోనే ప్రభుత్వం ఆలోచిస్తున్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ధరణి పోర్టల్, దరఖాస్తుదారులు, అధికారులు త్రిశంకుస్వర్గంలో ఉండిపోయారని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తెరపైకి తెచ్చిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అటు ప్రభుత్వాన్ని, ఇటు అధికారులను ఇరుకున పెడుతున్నదని పోలీస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఫోన్ ట్యాపింగ్ అంటూ హడావుడి చేసి పేర్లు బయటపెట్టి, కేసులు నమోదు చేసినా.. ఇప్పు డు ఎలా ముందుకు వెళ్లాలో అధికారులకు అర్థం కా వడం లేదట. వాస్తవానికి ప్రభుత్వాలు ఫోన్ ట్యా పింగ్ చేయడం సర్వ సాధారణమని, ఇది గుట్టుగా సాగే వ్యవహారమని, ఇందులో ఎవరున్నారో కూడా బయటికి తెలియదని అధికారులు మొదటి నుంచీ చెప్తున్నారట. ఈ వివరాలను బయటపెట్టడమంటే దేశ రహస్యాలను బయటపెట్టడమేనని, అంతర్గత భద్రతకు ముప్పు వాటిల్లుతుందని హెచ్చరిస్తున్నారట. ప్రభుత్వ పెద్ద మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా రాజకీయ కోణంలో ఫోన్ ట్యాపింగ్ను పెద్ద కుంభకోణంగా చిత్రీకరించడంతో ఇప్పుడు అనేక సమస్యలు ఎదురవుతున్నాయని అంటున్నారు. దేశంలో ఇప్పటివరకు ఇలాంటి వ్యవహారాలు బయటికి రాలేదని, ఎలా ముందుకు వెళ్లాలో రెఫరెన్స్ లేదని అధికారులు మథనపడుతున్నారట. సాంకేతికంగా ఎలాంటి ఆధారాలు లేకపోవడం న్యాయపరంగా ఎలాంటి చిక్కులు వస్తాయో, అంతర్గత భద్ర తపరంగా కేంద్రం నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో తెలియక సతమతం అవుతున్నారట. ఇప్పటికే ఈ అంశంపై కేంద్రం నుంచి చీవాట్లు పడ్డట్టు సమాచారం. ప్రభుత్వ పెద్దలు ఈ కేసులో ఒకరిద్దరు అధికారులతోనే మాట్లాడుతూ.. వాళ్లు చెప్పిందే వింటూ అదేశాలిస్తున్నారని, కనీసం భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదని వాపోతున్నారు.
మేం పథకాలు ప్రకటించాం కాబట్టి.. దానికి తగ్గట్టుగా రాష్ట్ర ఆదాయం పెంచాలి అని ఆదేశిస్తున్నారే తప్ప స్పష్టమైన రోడ్మ్యాప్ వివరించడం లేదని ఆయా శాఖల అధికారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఎన్నికల సమయంలో రాష్ర్టాన్ని తాగబోతులమయం చేస్తున్నారని, మద్యం ఆదాయంపైనే ప్రభుత్వం నడుస్తున్నదంటూ విమర్శలు గుప్పించారని, బెల్ట్షాపులను తొలిగిస్తామని ఘనంగా చెప్పుకున్నారని గుర్తుచేస్తున్నారు. తీరా ఇప్పుడు ఎక్సైజ్ ఆదాయం ఎందుకు పెరగడం లేదు? అని ప్రశ్నిస్తున్నారని వాపోతున్నారు. టార్గెట్లు పెట్టి, వారానికి, నెలకోసారి సమీక్షించి ‘అమ్మకాలు పెంచండి’ అని ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఫలితంగా రాష్ట్రంలోని బెల్ట్షాపులు ఇప్పటికీ కొనసాగుతున్నాయని అంటున్నారు. కొందరికే అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ, ఒత్తిడితెస్తూ.. ఇసుక అమ్మకాలు, మైనింగ్ విభాగం నుంచి సినరేజీ పెరగాలంటే ఎలా? అని చర్చ జరుగుతున్నది. జీఎస్టీ అధికారులపై కేసులు నమోదు చేస్తుండటంతో జీఎస్టీ వసూళ్లపై ప్రభావం పడే అవకాశం ఉన్నదని చెప్తున్నారు. రాష్ట్ర ఖజానాకు భూముల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం కూడా ఒక ప్రధాన వనరు. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో రియల్ఎస్టేట్ రంగం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నది. దీంతో భూముల అమ్మకాలు మందగించాయని అధికారులు చెప్తున్నారు. ఇదే సమయంలో తాము చెప్పిన వ్యక్తులకు అనుకూలంగా వ్యవహరించాలని ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి వస్తున్నదని, ఇలాంటి పరిస్థితుల్లో భూముల అమ్మకాల ఆదాయం ఎలా పెరుగుతుందని ప్రశ్నిస్తున్నారు. ఇక కొందరు ప్రభుత్వ పెద్దలు తమ వ్యక్తిగత కక్షతో బడా బిల్డర్లు, రియల్ఎస్టేట్ సంస్థలపై దాడులు చేస్తూ, రకరకాల ఇబ్బందులకు గురిచేస్తున్నారనే చర్చ జరుగుతున్నది. కారణం లేకున్నా భారీగా జరిమానాలు విధిస్తుండటంతో రాబడి తగ్గుతున్నదని అధికారులు వాపోతున్నారు.
ఈ పరిణామాలతో అధికారులు తీవ్ర ఒత్తిడితో నలిగిపోతున్నారని సమాచారం. తట్టుకోలేని కొందరు ఉన్నతాధికారులు ఇప్పటికే అనారోగ్యం పాలై దవాఖానల్లో చేరారని చెప్తున్నారు. దీంతో ఎలా తప్పించుకోవాలని వారు ఆలోచిస్తున్నట్టు సమాచారం. కొందరు శాఖలు మారేందుకు యత్నిస్తున్నారని, మరికొందరు సెలవులు పెట్టి యాత్రలకు వెళ్లాలని ప్లాన్ వేస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు ముందుగా అధికారులతో సమీక్షించి, చర్చించి, ఆ తర్వాతే నిర్ణయాలు ప్రకటించాలని కోరుతున్నారు.