Local Body Elections | హైదరాబాద్, మే17 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎన్నికలు జూన్లో నిర్వహిస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల చేసిన ప్రకటన రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఇది బీసీ రిజర్వేషన్లకు ఎసరు పెట్టేలా ఉన్నదనే ఆందోళన ఆ సామాజిక వర్గం నేతల్లో వ్యక్తమవుతున్నది. బీసీ రిజర్వేషన్లకు ఎగనామం పెడితేనే జూన్లో ఎన్నికలు నిర్వహించడం సాధ్యమవుతుందని బీసీ నేతలు చెప్తున్నారు. కామారెడ్డి సభలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన బీసీ డిక్లరేషన్ అమలు సంగతేమోకానీ ఉన్న రిజర్వేషన్లు కూడా పోయే దుస్థితి నెలకొన్నదని బీసీ నేతలు ఆందోళన చెందుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను రాజ్యాంగబద్ధంగా కల్పిస్తుండగా, బీసీలకు నామమాత్రంగా ఆయా రాష్ర్టాలే కల్పిస్తున్నాయి. లాటరీ పద్ధతిలో, ర్యాండమ్గా బీసీలకు రిజర్వేషన్లను కల్పిస్తుండగా ప్రతిసారీ వాటిపై న్యాయవివాదాలు తలెత్తుతున్నాయి.ఈ నేపథ్యంలో ఓబీసీ రిజర్వేషన్లపై కర్ణాటకకు చెందిన కేఈ కృష్ణమూర్తి, మహారాష్ట్రకు చెందిన వికాస్రావు గవాళి కేసులో సుప్రీంకోర్టు ట్రిపుల్ టీపద్ధతిలో, ర్యాండమ్గా బీసీలకు రిజర్వేషన్లను కల్పిస్తుండగా ప్రతిసారీ వాటిపై న్యాయవివాదాలు తలెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఓబీసీ రిజర్వేషన్లపై కర్ణాటకకు చెందిన కేఈ కృష్ణమూర్తి, మహారాష్ట్రకు చెందిన వికాస్రావు గవాళి కేసులో సుప్రీంకోర్టు ట్రిపుల్ టీ పేరిట పలు మార్గదర్శకాలు జారీ చేసింది. అందులో మొదటిది ప్రతి స్థానిక సంస్థ ఎన్నికల్లో ఓబీసీ రిజర్వేషన్ల అమలు, ఫలితాలపై అధ్యయనం చేసేందుకు పూర్తిస్థాయి రాజ్యాంగబద్ధమైన, డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటుచేయాలి. రెండోది జనాభా నిష్పత్తికి అనుగుణంగా రిజర్వేషన్లను స్థిరీకరించాలి. మూడోది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదు. వాటినే ట్రిపుల్ టీ అంటారు. వీటిని పాటించని ఏ రాష్ట్రంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఆ నిబంధనలను పాటించని పలు రాష్ర్టాల్లో స్థానిక సంస్థల ఎన్నికలను సైతం సుప్రీంకోర్టు రద్దు చేసింది. బీసీ కమిషన్ సిఫారసులు లేకుంటే బీసీలకు రిజర్వ్ చేసిన స్థానాలన్నింటినీ జనరల్గా మార్చే అవకాశం ఉన్నది. దీనిని బట్టి కమిషన్ల నివేదిక లేకుండా స్థానిక సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్లు ఇకపై ఉండబోవనేది స్పష్టంగా తెలుస్తున్నది.
సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి తెలంగాణ ప్రభుత్వం గతంలోనే డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ నేతృత్వంలో పూర్తిస్థాయి డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటుచేసింది. దీనిపై అధ్యయనం చేపట్టిన కమిషన్.. తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లో పర్యటించింది. గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పుల వల్ల ఉత్పన్నమైన అంశాలను పరిశీలించింది. ఆయా రాష్ర్టాల్లో అమలుచేస్తున్న బీసీ రిజర్వేషన్లు, సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలు, జనగణనలో ఎదురైన సవాళ్లు, పరిష్కార మార్గాలు తదితర అంశాలపై అక్కడి బీసీ కమిషన్లతో సమాలోచనలు జరిపింది. అనంతరం రాష్ట్ర ఉన్న తాధికారులతో ప్రత్యేకంగా సమావేశమై విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో (స్థానిక సంస్థలలో) బీసీల ప్రాతినిథ్యం, పొందిన అవకాశాలకు సంబంధించి ఆయా శాఖల వద్ద ఉన్న సమాచారాన్ని, గణాంకాలను అందజేయాలని ఆదేశించింది. ఆ సమాచారం కమిషన్కు ఇప్పటికీ చేరలేదని తెలుస్తున్నది. దీంతో నివేదికను సమర్పించడంలో తీవ్ర జాప్యమవుతున్నదని భావిస్తున్నారు.
సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ర్టాలు బీసీ కమిషన్లను ఏర్పాటు చేసి వాటి సిఫారసుల మేరకు బీసీ రిజర్వేషన్లను స్థిరీకరించి ఎన్నికలు నిర్వహించాయి. ఆయా రాష్ర్టాలు ఓటరు జాబితా ఆధారంగా బీసీల రిజర్వేషన్లను స్థిరీకరించాయి. ఓటరు జాబితా ప్రకారం రిజర్వేషన్లను స్థిరీకరించాలనుకుంటే తాజా ఓటరు జాబితా ఆధారంగా చేయాల్సి ఉంటుంది. అప్డేటేడ్ ఓటరు జాబితా ఇప్పటికీ కమిషన్ను చేరలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఓటరు జాబితా ప్రకారమైనా బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణకు మరో రెండు నెలల సమయం పడుతుందనేది అంచనా. ఈ నేపథ్యంలో జూన్ చివరినాటికి ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం ప్రకటించడంతో బీసీల రిజర్వేషన్లు ఇక గల్లంతేనని బీసీ నేతలు ఆందళోన చెందుతున్నారు. అందుకు ఒడిశా అనుభవాన్ని ఉదహరిస్తున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్లను కల్పించి స్థానికసంస్థల ఎన్నికలను నిర్వహించింది. అదే బాటలో రేవంత్ సర్కారు ముందుకు వెళ్తున్నదని భావిస్తున్నారు. అలా అయితేనే కమిషన్ నివేదిక లేకుండానే సీఎం ప్రకటించినట్టు జూన్ నెలాఖరులో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం సాధ్యమవుతుందని, లేదంటే అది అసాధ్యమని చెప్తున్నారు.
రాష్ట్రంలో ఇంటింటి సమగ్ర కులాలగణన (సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ రంగాల వారీగా) నిర్వహిస్తామని, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని, అదీ బీసీ ఉపకులాల వారీగా అమలు చేస్తామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో కాంగ్రెస్ ప్రకటించింది. ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా ఈ అం శాన్ని చేర్చింది. అయితే ప్రస్తుతం సీఎం రేవంత్రెడ్డి చేసిన ప్రకటన ఈ డిక్లరేషన్కు తిలోదకాలిచ్చేలా ఉన్నదని బీసీ నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కులగణన నిర్వహించలేదు. కులాల సర్వే కోసం ప్రభుత్వం రూ.150 కోట్లు మంజూరు చేసింది. సర్వేను ఏ పద్ధతిలో, ఏవిధంగా నిర్వహించాలనే అంశాలపై బీసీ కమిషన్కు ఎలాంటి మార్గదర్శకాలను జారీ చేయలేదు. ఇటీవలనే కులాల సర్వేకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సూత్రప్రాయంగా బీసీ కమిషన్కు సూచించినట్టు తెలుస్తున్నది. కులాల సర్వే ఇప్పట్లో పూర్తికాదని, దాదాపు ఏడాది సమయం పడుతుందని బీసీ నేతలు, అధికారులు అంచనా వేస్తున్నారు. జూన్ నెలాఖరులోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం ప్రకటించడంతో బీసీ డిక్లరేషన్ ఉత్తముచ్చటే అని తేలిపోయిందని బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. కులాల సర్వే నిర్వహించిన తరువాతే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి.