ఐపీఎల్-17లో కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా సారథ్యంలో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ సీజన్ను ఓటమితో ఆరంభించి ఓటమితోనే ముగించింది. ముంబై వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో బౌలింగ్తో పాటు మిడిలార్డర్ వైఫల్యంతో పదో ఓటమిని మూటగట్టుకుంది. తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో నికోలస్ పూరన్ ఊచకోతతో లక్నోకు ఓదార్పు విజయం దక్కింది. ఆరంభంలో రోహిత్ శర్మ, ఆఖర్లో నమన్ ధీర్ మెరుపులే వాంఖడేలో ముంబై అభిమానులకు ఊరటనిచ్చాయి.
IPL | ముంబై: ఐపీఎల్-17 సీజన్ను ఓటమితో మొదలుపెట్టిన ముంబై ఇండియన్స్.. అపజయంతోనే ముగించింది. సొంత మైదానం వాంఖడేలో లక్నో సూపర్ జెయింట్స్తో తమ ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడిన హార్దిక్ సేన.. 215 పరుగులను ఛేదించే క్రమంలో 196కే పరిమితమై 18 రన్స్ తేడాతో పరాభవాన్ని మూటగట్టుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో.. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ నికోలస్ పూరన్ (29 బంతుల్లో 75, 5 ఫోర్లు, 8 సిక్సర్లు) ప్రత్యర్థి బౌలర్లపై దండెత్తడంతో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. కెఎల్ రాహుల్ (41 బంతుల్లో 55, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించాడు. ఛేదనలో ముంబైకి రోహిత్ శర్మ (38 బంతుల్లో 68, 10 ఫోర్లు, 3 సిక్సర్లు) అదిరిపోయే ఆరంభమిచ్చినా మిడిలార్డర్ చేతులెత్తేశారు. ఆఖర్లో నమన్ ధీర్(28 బంతుల్లో 62 నాటౌట్, 4ఫోర్లు,5 సిక్స్లు) పోరాడినా ఆ జట్టు 196/6 వద్దే ఆగిపోయింది.
లక్నో ఇన్నింగ్స్ మూడో బంతికే పడిక్కల్ను తుషారా డకౌట్ చేశాడు. స్టోయినిస్ (28) ఐదు బౌండరీలతో దూకుడు కనబరిచినా చావ్లా 6వ ఓవర్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. చావ్లా ఓవర్లోనే రెండు భారీ సిక్సర్లు కొట్టిన రాహుల్.. తర్వాత నెమ్మదించాడు. స్టోయినిస్ స్థానంలో వచ్చిన దీపక్ హుడా (11) మళ్లీ చేతులెత్తేశాడు. 10 ఓవర్లకు లక్నో స్కోరు 69/3గా ఉంది.
నెమ్మదిగా సాగుతున్న లక్నో స్కోరుబోర్డు పూరన్ రాకతో బుల్లెట్ వేగాన్ని అందుకుంది. కంబోజ్ బౌలింగ్లో సిక్స్తో పరుగుల ఖాతా తెరిచిన ఈ విండీస్ వీరుడు.. తర్వాత ముంబై బౌలర్లను ఊచకోత కోశాడు. కంబోజ్ 13వ ఓవర్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 22 పరుగులు రాబట్టిన అతడు.. అర్జున్ టెండూల్కర్ 15వ ఓవర్లో రెండు సిక్సర్లతో 19 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తిచేశాడు. మరో ఎండ్లో రాహుల్ అతడికి పూర్తి సహకారం అందిస్తూనే ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. ధాటిగా ఆడే క్రమంలో ఈ ఇద్దరూ నిష్క్రమించినా ఆఖర్లో బదోని (22 నాటౌట్) లక్నో స్కోరును 210 మార్కు దాటించాడు. ఆఖరి 10 ఓవర్లలో లక్నో ఏకంగా 145 పరుగులు రాబట్టడం విశేషం.
కొండంత స్కోరును కరిగించే క్రమంలో ముంబై కూడా ఆది నుంచే లక్నో బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. బౌండరీతో పరుగుల ఖాతా తెరిచిన రోహిత్.. హెన్రీ రెండో ఓవర్లో మిడ్ వికెట్, లాంగాఫ్ మీదుగా భారీ సిక్సర్లతో వాంఖడేను ఉర్రూతలూగించాడు. నవీన్, మోహ్సిన్ ఓవర్లలో బౌండరీలతో విరుచుకుపడ్డ అతడు.. 28 బంతుల్లోనే 50 పరుగులు పూర్తిచేశాడు. రోహిత్కు అండగా నిలిచిన బ్రెవిస్ (23)ను ఔట్ చేసిన నవీన్ 88 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరదించడంతో ముంబై కుదుపునకు లోనైంది. సూర్యకుమార్ యాదవ్ డకౌట్ అవగా రోహిత్ను బిష్ణోయ్ ఔట్ చేసి లక్నోను పోటీలోకి తెచ్చాడు. హార్దిక్ పాండ్యా (16), నేహాల్ వధెరా(1) విఫలమయ్యారు. ఆఖర్లో నమన్ ధీర్ మెరుపులతో లక్నోను భయపెట్టినా ముంబైని విజయతీరాలకు చేర్చలేకపోయాడు.
లక్నో: 20 ఓవర్లలో 214/6 (పూరన్ 75, రాహుల్ 55, తుషారా 3/28, చావ్లా 3/29).
ముంబై: 20 ఓవర్లలో 196/6 (రోహిత్ శర్మ 68, నమన్ 62 నాటౌట్, బిష్ణోయ్ 2/37, నవీన్ 2/50)