Hyderabad | సిటీబ్యూరో, మే 8 (నమస్తే తెలంగాణ)/దుండిగల్/బేగంపేట: మండు వేసవిలో కురిసిన ఒక్క వర్షానికే నగరం అతులాకుతలమైంది. నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వేర్వేరు ప్రాంతాల్లో 10 మంది మృత్యువాత పడ్డారు. మంగళవారం వర్షం వస్తుందని వాతావారణ శాఖ ముందే సూచనలు చేసినా.. అప్రమత్తంగా ఉండాల్సిన అధికార యంత్రాంగం నిద్రావస్థలో ఉన్నది. సాయంత్రం కార్యాలయాల నుంచి ఇండ్లకు వెళ్లే సమయంలో వానపడటంతో ఎక్కడికక్కడే ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈదురుగాలులతో విద్యుత్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సంబంధిత శాఖల నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. బాచుపల్లిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్ గోడ కూలీ ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ఇక్కడ సహాయక చర్యల్లో జాప్యం కావడంతో మృతుల సంఖ్య పెరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరో ఘటనలో బేగంపేట నాలాలో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. బహదూర్పురలో విద్యుదాఘాతంతో ఓ యువకుడు చనిపోయాడు. ఇలా హైదరాబాద్లో ఒక్కరోజే కురిసిన ఒక్కవానకే నిండు ప్రాణాలు పోవడం ఆందోళన కలిగిస్తున్న అంశం.
బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో గోడ కూలి వలస కూలీలు మృతిచెందిన ఘటనలో బిల్డర్ అరవిందరెడ్డిపై హత్య కేసు నమోదు చేశారు. రేణుక ఎల్లమ్మ కాలనీలోని 2 ఎకరాల 17 గుంటల స్థలంలో బిల్డర్ అరవిందరెడ్డి హెచ్ఎండీఏ అనుమతులతో సెల్లార్ స్టిల్ట్+5 అంతస్తులతో అపార్ట్మెంట్లను నిర్మిస్తున్నాడు. హర్జనా రైజ్ అనే నిర్మాణ సంస్థ పేరిట నిర్మిస్తున్న ఈ బహుళ అంతస్తుల భవనం చుట్టూ ఇటీవల సుమారు 30 ఫీట్ల ఎత్తులో రిటైనింగ్ వాల్ నిర్మించారు. దీనిని ఆనుకుని బయటివైపు వలస కూలీల కోసం రేకుల గుడిసెలు ఏర్పాటు చేశారు. ఇక్కడ సుమారు 150 కుటుంబాలకు చెందిన కూలీలు నివాసముంటున్నారు. మంగళవారం కురిసిన వానతో మట్టిపలుచబడి కుంగడంతో పాటు వాననీరు బయటకు వెళ్లేదారి లేకపోవడంతో ఒత్తిడిపెరిగి రిటైనింగ్ వాల్ కుప్పకూలి గుడిసెల్లో ఉన్న కూలీలపై పడింది. దీంతో చిన్నారితో పాటు ఆరుగురు కూలీలు సజీవ సమాధి అయ్యారు. బాచుపల్లి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే విద్యుత్ సరఫరా లేకపోవడం, ఘటనా స్థలానికి వెళ్లే దారిలో గోడ కూలిపోయి ఉండటం, మరో దారి లేకపోవడంతో కాంక్రీట్, మట్టిలో కూరుకుపోయిన వారిని బయటకు తీయడంలో ఆలస్యం జరిగింది. సహాయక చర్యలు చేయడంలో మున్సిపల్ విభాగం, విపత్తుల నిర్వహణ శాఖ నుంచి ఎలాంటి సహకారం లేకపోవడంతో మట్టిలో కూరుకుపోయిన వారిని బయటకు తీయడానికి గంటల సమయం పట్టింది. చివరకు ఏడు మృతదేహాలు బయటపడ్డాయి. నాసిరకంగా రిటైనింగ్ వాల్ నిర్మించి ఏడుగురి ప్రాణాలు కోల్పోయేందుకు కారకుడైన బిల్డర్ అరవిందరెడ్డిపై హత్యకేసును నమోదు చేసినట్లు కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు, బాచుపల్లి సీఐ ఉపేందర్ తెలిపారు. ఆయనతో పాటు సైట్ ఇంజినీర్ సతీశ్, ప్రాజెక్ట్ మేనేజర్ ఫ్రాన్సిస్, కాంట్రాక్టర్లు రాజేశ్, సింహాచలం, రాంరెడ్డి తదితరులపైనా కేసులు నమోదు చేశామన్నారు. కాగా, గోడ కూలి మృతిచెందిన వలస కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించినట్లు కార్మికశాఖ అధికారులు తెలిపారు.
కూకట్ పల్లి నుంచి బేగంపేట మీదుగా ప్రవహించే నాలాలో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. బేగంపేట పోలీస్ ఇన్స్పెక్టర్ జయచంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం బేగంపేటలోని కూకట్పల్లి నాలాలో రెండు మృతేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్గం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుల వద్ద లభించిన ఆధారాల ప్రకారం ఒడిశాకు ప్రాంతానికి చెందిన చంద్రపాండా(38,) మనోజ్ దాస్ (45) ఓల్డ్ కస్టమ్స్ బస్తీలో ఓ గదిని అద్దెకు ఉంటున్నారు. అమీర్పేటలో ఓ హోటల్లో కార్మికులుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరిద్దరూ అమీర్పేటలోని ఓ హోటల్ డ్యూటీ ముగిసిన అనంతరం ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యలో గ్రీన్ ల్యాండ్ సమీపంలోని కంట్రీ క్లబ్ ఎదురుగా ఉన్న వైన్ షాపులో మద్యం తాగారు. ఇంటికి వెళ్తున్న క్రమంలో అప్పటికే భారీగా కురుస్తున్న వర్షంలో ఓల్డ్ కస్టమ్స్ బస్తీలో రైలు పట్టాలు దాటుతుండగా నాలాలో పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదవశాత్తు నాలాలో పడ్డారా..? మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలాఉండగా బహదూర్పురలో ఫక్రుద్దీన్ అనే వ్యక్తి వర్షం పడుతున్న సమయంలో కరెంటు స్థంభాన్ని పట్టుకోవడంతో విద్యుత్ఘాతానికి గురై మృతి చెందాడు.
తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ, దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో రాగల మరో రెండు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. కాగా, మంగళవారం దంచికొట్టిన వానతో నగర వాతావరణం కొంత చల్లడినప్పటికీ బుధవారం మధ్యాహ్నం ఎండలు మండిపో యాయి. వాన ప్రభావంతో మొన్నటి వరకు 43 డిగ్రీలు దాటి నమోదైన ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి దిగివచ్చాయి. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 36.8, కనిష్ఠం 21.9 డిగ్రీలు, గాలిలో తేమ 47 శాతంగా నమోదైనట్లు అధికారులు తెలిపారు.
ఒకే ఒక్క వర్షం విద్యుత్ శాఖ నెట్వర్క్ను అతలాకుతలం చేసింది. మహానగరంలో అంధకారం అలముకున్నది. ఒకేసారి 380 ఫీడర్ల పరిధిలో సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఫలితంగా అర్ధరాత్రి విద్యుత్ శాఖ యంత్రాంగం పనిచేసినా.. పూర్తి స్థాయిలో పునరుద్ధరించలేకపోయింది. బుధవారం ఉదయం వరకు వర్షానికి దెబ్బతిన్న లైన్లను సరిచేయడంలోనే నిమగ్నమయ్యాయి. ఫలితంగా 9 సర్కిళ్లలో విద్యుత్ ఫీక్ అవర్ డిమాండు 1100 మెగావాట్లకు పడిపోయింది. వాతావరణం చల్లబడటం, విద్యుత్ సరఫరాలో గంటల తరబడి అంతరాయంతో కరెంటు వినియోగం సైతం 77 మిలియన్ యూనిట్లకు తగ్గిపోయింది. గ్రేటర్లో చాలా చోట్ల ఫ్లెక్సీలు గాలికి ఊడిపోయి సమీపంలోని 33 కేవీ లైన్లపైనే పడటంతో వందలాది సబ్ స్టేషన్ల పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అర్ధరాత్రి వరకు 90 శాతం విద్యుత్ పునరుద్ధరణ చేయగా, బుధవారం ఉదయం పూర్తి స్థాయిలో సరఫరా జరిగేలా అధికార యంత్రాంగం నిరంతరాయంగా పనిచేసింది.