బెంగళూరు : పొరుగు రాష్ట్రం కర్నాటకలో ఓలా, ఉబర్, ర్యాపిడో సంస్థలు ఆటోరిక్షా సర్వీసులను బుధవారం నుంచి నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆన్లైన్ బుకింగ్స్పై సైతం నిషేధిస్తున్నట్లు పేర్కొంది. రోడ్డు రవాణ సంస్థచ, రోడ్డు భద్రత విభాగంతో నిర్వహించిన భేటీలో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. తదుపరి ఆదేశాలు జారీ చేసేంతవరకు ఆయా సంస్థలు ఎలాంటి సేవలను ఇచ్చేందుకు అనుమతి లేదని ఆ రాష్ట్ర రవాణ సంస్థ కమిషనర్ స్పష్టం చేశారు. ఆన్-డిమాండ్ రవాణా టెక్నాలజీ అగ్రిగేటర్స్ రూల్ (Kottar-2016) చట్టం ప్రకారం క్యాబ్ సంస్థలు ఆటో రిక్షా సర్వీసులు అందించడానికి అవకాశం లేదని కమిషనర్ పేర్కొన్నారు.
ఈ మేరకు సేవలను నిలిపివేసేలా సైబర్ డివిజన్కు లేఖ రాస్తామని, ఆదేశాలను ఉల్లంఘిస్తే రూ.5వేల జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. సాధారణ ఆటోవాలాలపై ఎలాంటి చర్యలు ఉండవని, సర్వీసులు అందించే సంస్థలకే వర్తిస్తాయని చెప్పారు. ఆటోరిక్షా సేవలను తిరిగి ప్రారంభించేందుకు టాక్సీ అగ్రిగేటర్లు తిరిగి దరఖాస్తు చేసుకోవాలని, ప్రభుత్వం కార్లిటీ ఇచ్చే వరకు బుకింగ్ సేవలను నిలిపివేయాలని స్పష్టం చేశారు. అయితే, నిషేధం విధించినా ప్రయాణికులు, ఆటో డ్రైవర్లు మాత్రం యాప్స్ను వినియోగిస్తున్నారు. యాప్ సర్వీస్ నిలిపివేయబడలేదని, తమ త్రీవీలర్ ఆటో సేవలను కొనసాగించేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి కంపెనీ సిద్ధంగా ఉందని అధికారిక ప్రకటనలో ఉబర్ తెలిపింది.