వానకాలం సాగు జిల్లాలో ముమ్మరంగా సాగుతున్నది. రైతులు ఏయే పంటలు సాగు చేశారు? ఎంత విస్తీర్ణంలో వేశారు? అనే వివరాలను క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ సేకరించే పనిలో నిమగ్నమైంది. సాగు వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేసేందుకు రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రత్యేక యాప్ను రూపొం దించింది. వ్యవసాయ క్లస్టర్ల వారీగా పొలాల వద్దనే ప్రత్యేక యాప్లో వివరాలు నమోదు చేస్తున్నారు. వారం రోజులుగా జిల్లావ్యాప్తంగా రైతుల పంట వివరాలను వ్యవసాయశాఖ అధికారులు సేకరిస్తున్నారు. వానకాలంలో ఏ పంట ఎంత సాగుచేశారనే లెక్కలను తేల్చే పనిలో బిజీగా ఉన్నారు. గ్రామాల్లో వ్యవసాయ అధికారులు, రైతుబంధు సమితి సభ్యులు రైతుల పంటల వివరాలను ఫీల్డ్ విజిట్ చేసి, ప్రత్యేక ఫార్మాట్లోనే రూపొందించిన 17 అంశాలను నమోదు చేస్తున్నారు.
సిద్దిపేట, జూలై 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఏ పంట వేశారు? ఎన్ని ఎకరాలు సాగు చేశారు? ఎన్ని ఎకరాల్లో వరి సాగైంది? పత్తిని ఎన్ని ఎకరాల్లో వేశారు? కందిని ఎంత మేరకు సాగు చేశారు? ఆయిల్పామ్ ఎంత వరకు పెట్టారు?.. ఇలా ప్రతి గుంట భూమిలో ఏ పంట ఎంత సాగు చేశారనే వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు తీసుకుంటున్నారు. క్లస్టర్ వారీగా పొలాల వద్దనే ప్రత్యేక యాప్లో వివరాలను నమోదు చేస్తున్నారు. గడిచిన వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా రైతుల పంట వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు సేకరిస్తున్నారు. దీంతో వానకాలంలో ఏపంట ఎంత సాగు చేశారనే లెక్కలను తేల్చే పనిలో వ్యవసాయ శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. ఏ గ్రామంలో పంట వివరాలు నమోదు చేస్తున్న సమచారాన్ని ముందే ఆ గ్రామానికి చెందిన వాట్సాప్ గ్రూప్లో పెడుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు విస్తృతంగా రైతులకు అవగాహన కల్పిండంతో పాటుగా గ్రామ పంచాయతీల మైక్ల్లో , చాటింపు ద్వారా తెలియజేస్తున్నారు. ఆ రైతు పొలం వద్దే యాప్లో పంట వివరాలను అప్లోడ్ చేస్తారు. గ్రామాల్లో వ్యవసాయ శాఖ అధికారులు, రైతుబంధు సమితి సభ్యులు రైతుల పంటల వివరాలను ఫీల్డ్ విజిట్ చేసి, ప్రత్యేక ఫార్మాట్లోనే నమోదు చేస్తున్నారు. రైతులు తమ పంట వివరాలను అధికారులకు చెప్పాలని వ్యవసాయ శాఖ కోరుతున్నది.
పొలాల వద్దే వివరాల నమోదు
రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నది. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరను కల్పించి రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొంటున్నది. రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నా, రైతులకు ఎలాంటి నష్టం జరగవద్దని సీఎం కేసీఆర్ రైతులకు దన్నుగా నిలుస్తున్నారు. జిల్లాలో 2.50లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. పత్తి సాగు 2 లక్షల ఎకరాల్లో, కందులు 40 వేల ఎకరాలు, మక్కజొన్న 50 వేల ఎకరాలు, ఆయిల్పామ్ సాగు 25 వేల ఎకరాల్లో, ఇతర పంటలు సాగు అవుతాయని అంచనా వేశారు. వీటితో పాటు జిల్లాలో కూరగాయల సాగు కూడా ఎక్కువగానే సాగవుతున్నది. ఇందుకు అవసరమైన సీడ్స్ను ఎరువులను వ్యవసాయ శాఖ అధికారులు అందించారు. జిల్లా వ్యాప్తంగా పది రోజల నుంచి వర్షాలు పడుతుండడంతో ప్రస్తుతం వరి నాట్లు జిల్లాలో జోరుగా వేస్తున్నారు. వానకాలం సాగు పెట్టుబడుల కోసం రైతుబంధును రైతుల ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం వేసింది. సకాలంలో ఎరువులు, విత్తనాలను అందించింది. ఈ క్రమంలో వానకాలంలో ఏ పంట ఎంత సాగు చేశారు? ఏ పంట ఎంత వస్తుంది? ఆ పంటల కు మార్కెటింగ్ సౌకర్యం ఎలా కల్పించాలి? అనే దానిపై ముందుగానే ప్రభుత్వం ఒక ప్రణాళిక రూపొందించనున్నది. జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా వరి పంటతో పాటుగా పత్తి, మొక్కజొన్న, కంది తదితర పంటలను సాగు చేశారు. వరి నాట్లు కొన్ని ప్రాంతాల్లో వేస్తున్నారు. సాగు వివరాల నమోదులో ఏ గుంట భూమిలో ఎంత పంట వేశారనే వివరాలు తేలనున్నాయి. క్లస్టర్ల వారీగా వ్యవసాయ శాఖ అధికారులు, రైతుబంధు సమితి సభ్యలు పంటల సాగు వివరాలు సేకరిస్తున్నారు. సాగు వివరాలను రైతులు కరెక్ట్గా తెలిపితేనే, రేపు పండిన పంటను ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. రైతు పండించిన పంట ఒకటి, నమోదు మరోటి ఉంటే ధాన్యం అమ్ముకునే సమయాల్లో ఇబ్బందులు తలెత్తనున్నాయి. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం, సాగు వివరాలను పక్కాగా సేకరిస్తున్నది. రైతు పండించిన ప్రతి గింజనూ మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. సాగు వివరాలు పక్కాగా ఉంటే ఏ గ్రామం నుంచి ఎంత పంట వస్తుందో ముందే మనకు తెలిసిపోతుంది. అందుకు అనుగుణంగా మార్కెటింగ్ సౌకర్యం కల్పించవచ్చు. రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయవచ్చు. మన రాష్ట్రం అవసరాలకు సరిపడా చూసుకోని ఏ పంటను ఏ రాష్ర్టానికి ఎగుమతి చేసుకోవచ్చు అనే ప్రణాళికను ముందే రూపొందించుకోవచ్చు.
17 అంశాలతో నమోదు
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా ప్రత్యేక యాప్ను రూపొందించింది. ప్రతీ క్లస్టర్కు ఒక వ్యవసాయ అధికారిని నియమించింది. క్లస్టర్ వారీగా రైతు వేదికలను నిర్మాణం చేయడంతో రైతుల సమావేశాలు, వారికి సాగులో మెళకువలు తదితర విషయాలపై సలహాలు, సూచనలిస్తున్నారు. నిరంతరం రైతు వేదికలలో వ్యవసాయ శాఖ అధికారులు అందుబాటులో ఉంటారు. యాప్ ద్వారా ఆయా మండలాల ఏఈవోలు, రైతుల వద్దకు వెళ్లి రోజు వారీ విధులను నమోదు చేసేలా యాప్ను రూపొందించారు. ఇప్పటికే యాప్ నిర్వహణపై వ్యవసాయ శాఖ అధికారులకు శిక్షణ సైతం ఇచ్చారు. రైతు వేదికలో సమావేశాలు, క్రాప్ బుకింగ్, రైతుబీమా, విత్తన అనుమతులు, కొనుగోలు కేంద్రాల వివరాలు, భూసార పరీక్షలు, పంటకోత ప్రయోగాలు, జిల్లా స్థాయి సమావేశాలు, రైతు పొలాల ప్రదర్శనలు, రైతుబంధు, పీఎం కిసాన్, శిక్షణలు, ఇన్పుట్ సబ్సిడీ పంపిణీ, రిజిస్టర్ల నిర్వహణ, ప్రదర్శనల సందర్శన, రచ్చబండ, అధికారుల సందర్శన వంటి వివరాలుంటాయి. ప్రతి వారం ఏఈవోల పని తీరుపై గ్రేడింగ్ చేసేలా పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రతిరోజు ఏఈవోలు రైతు వేదికల వద్ద హాజరు నమోదు చేసుకుంటారు. అక్కడ ఉంటేనే ఆయాప్ అప్లోడ్ అవుతుంది. ప్రతి రోజు హాజరు నమోదు చేసుకున్న తర్వాత రైతుల పొలాల వద్దకు వెళ్లి సలహాలు, సూచనలిస్తున్నారు.