వారణాసి : దేశంలో కరోనా పంజా విసురుతోంది. చిన్నాపెద్ద తేడా లేకుండా అందరూ మహమ్మారి బారినపడుతున్నారు. నవజాత శిశువులు సైతం వైరస్కు పాజిటివ్గా పరీక్షలు చేసిన సంఘటనలూ ఉన్నాయి. తాజాగా పుట్టిన వెంటనే నవజాత శిశువు పాజిటివ్గా పరీక్షించగా.. తల్లి మాత్రం నెగెటివ్గా పరీక్షించడం విస్మయానికి గురి చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ వారణాసిలోని బీహెచ్యూ ఆసుపత్రిలో చోటు చేసుకోగా.. సర్వత్రా చర్చనీయాంశమైంది. దేశంలో తొలిసారిగా ఇలాంటి కేసు నమోదైందని పేర్కొంటున్నారు. బీహెచ్యూ హాస్పిటల్కు సుప్రియా ప్రజాపతి అనే మహిళను కుటుంబీకులు డెలివరీ కోసం ఇటీవల తీసుకువచ్చారు. కరోనా సోకిందా? లేదా? తెలుసుకునేందుకు ఈ నెల 25న నమూనాలను సేకరించి ఆర్టీపీసీఆర్ పరీక్షలకు పంపారు.
పరీక్షల్లో ఆమెకు నెగెటివ్గా తేలింది. ఆ తర్వాతి రోజు మధ్యాహ్నం సమయంలో మహిళ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. కొవిడ్ నిబంధనల మేరకు నవజాత శిశువుకు పరీక్షలు నిర్వహించగా.. వైరస్ పాజిటివ్గా తేలింది. తల్లీ బిడ్డ ఇద్దరూ సంపూర్ణ ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. అయితే సుప్రియా మాత్రం తనకు, కుటుంబంలో ఎవరికీ ఇప్పటి వరకు వైరస్ సోకలేదని చెప్పింది. దీంతో దీంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. డెలివరీకి ముందు టెస్టుల ఫలితం తప్పుగా వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం ఘటనపై విచారణ జరుపుతున్నారు.