మునుగోడు ఉప ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ విడుదల కాగా నేడు నోటిఫికేషన్ రానున్నది. శుక్రవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండగా 14 వరకు కొనసాగనున్నది. 17 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉన్నది. చండూరులోని తాసీల్దార్ కార్యాలయంలో దాని కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. నామినేషన్ దాఖలు సమయం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటుంది. అన్ని ప్రధాన పార్టీలు నామినేషన్ దాఖలుకు సన్నాహాలు చేస్తున్నారు. టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ అభ్యర్థిని నేడో రేపో ప్రకటించనున్నట్లు సమాచారం. ఉప ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు నియమావళిని పాటించాలని గురువారం కలెక్టర్ వినయ్క్రిష్ణారెడ్డి రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు.
చండూరు, అక్టోబర్ 6 : మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల నోటిఫికేషన్ శుక్రవారం రానున్నది. ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 7 నుంచి 14 వరకు కొనసాగనున్నది. అందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. స్థానిక తాసీల్దార్ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరించనున్నారు. ఎన్నికల రిటర్నరింగ్ అధికారిగా జగన్నాథరావు వ్యవహరించనున్నట్లు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ప్రకటించారు. తాసీల్దార్ కార్యాలయానికి 100 మీటర్ల దూరం వరకు బారికెడ్లు ఏర్పాటు చేశారు. నామినేషన్ దాఖలు చేసే వ్యక్తితో కలిసి ఐదుగురికి మాత్రమే కార్యాలయంలోకి అనుమతిస్తారు. వారి వాహనాల పార్కింగ్ కోసం స్థానిక జడ్పీహెచ్ఎస్లో ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.
అమల్లోకి ప్రవర్తనా నియమావళి ఎన్నికల కోడ్ సోమవారం నుంచే అమల్లోకి రాగా, దానిని పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నియోకవర్గంలో ఏర్పాటు చేసిన 6 చెక్పోస్టుల్లో నిరంతం తనిఖీలు నిర్వహించనున్నారు. ఎన్నికలకు నియోజకవర్గంలోని 298 పోలింగ్ కేంద్రాలకు అవసరమై ఈవీఎంలను స్థానిక డాన్బోస్కో కళాశాలో భద్రపరిచేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అక్కడి నుంచే ఎన్నికల సామగ్రిని పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు నామినేషన్ దాఖలుకు సన్నాహాలు చేస్తున్నాయి. అధికార పార్టీ టీఆర్ఎస్(బీఆర్ఎస్) నేడో రేపో అభ్యర్థిని ప్రకటించనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 14న నామినేషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. షెడ్యూలు విడుదలకు ముందే ఆయా పార్టీల నాయకులు ఏర్పాటు చేసిన వాల్ రైటింగ్, పోస్టర్లు, హోర్డింగ్లను అధికారులు తొలగించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాలి
జిల్లా కలెక్టర్ టి. వినయ్క్రిష్ణారెడ్డి
నీలగిరి. అక్టోబర్ 6 : మునుగోడు ఉప ఎన్నికలు ప్రశాంత వాతవరణంలో నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని, ఎన్నికల నియమావళిని పాటించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ టి.వినయ్క్రిష్ణారెడ్డి సూచించారు. గురువారం తన చాంబర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సంఘం ఈ నెల 3న ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినందున అదే రోజు నుంచి యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిందన్నారు. ప్రభుత్వ అస్తులు, కార్యాలయాలపై ఎన్నికల ప్రచారానికి సంబంధించిన రైటింగ్ రాయవద్దన్నారు. ఎన్నికల కోడ్ అమలుకు 16 ఎంసీసీ టీములను ఏర్పాటు చేశామని, సభలు సమావేశాలు వీడియో తీసేందుకు 7 వీఎస్టీ టీములు, మద్యం, డబ్బు పంపిణీ అరికట్టేందుకు, వాహనాల తనిఖీకి 14 ఎఫ్ఎస్టీ టీమ్లు, మరో 18 ఎస్ఎస్టీ టీములు ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ అతిథి గృహాలు, వాహనాలు ఎన్నికల ప్రచారానికి వాడరాదన్నారు. ఈ నెల 7 నుంచి 14 వరకు నామినేషన్లు స్వీకరణ, 15న పరిశీలన, 17న ఉపసంహరణ ఉంటుందని పేర్కొన్నారు. నామినేషన్లు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రిటర్నింగ్ అధికారి కార్యాలయం చండూర్లో దాఖలు చేయాలన్నారు. రెండో శనివారం, ఆదివారం నామనేషన్లు స్వీకరించరని చెప్పారు. నవంబర్ 3న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరుగుతుందని, 6న కౌంటింగ్ ఉంటుందని పేర్కొన్నారు. నవంబర్ 8న ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ భాస్కర్రావు, నల్లగొండ ఆర్డీఓ జయచంద్రారెడ్డి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిథులు పుచ్చకాయల నర్సిరెడ్డి, కేతావత్ శంకర్నాయక్, బక్కా పిచ్చయ్య, రజియొద్దీన్, లింగస్వామి, కలెక్టరేట్ అధికారులు కృష్ణమూర్తి, విజయ్కుమార్ పాల్గొన్నారు.