ఖమ్మం రూరల్, ఏప్రిల్ 22: ప్రజలను అయోమయానికి గురిచేసి.. మోసపూరిత హామీలను గుప్పించడం వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఖమ్మం ఎంపీ, బీఆర్ఎస్ ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విమర్శించారు. హామీలను అమలు చేయని ఆ పార్టీకి ఈ లోక్సభ ఎన్నికల్లో కర్రుకాల్చి వాతపెట్టాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు. మండలంలోని పోలేపల్లిలో ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ అధ్యక్షతన సోమవారం జరిగిన ఆ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తరువాత పాలేరు నియోజకవర్గం ఎంతలా అభివృద్ధి చెందిందో ప్రజలందరికీ తెలుసునని అన్నారు. రైతుబంధుకు రాంరాం చెబుతున్న ఈ కొత్త ప్రభుత్వం.. భవిష్యత్తులో రైతు సంక్షేమ పథకాలను కూడా తుంగలో తొక్కే ప్రమాదం కన్పిస్తోందని అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం నిలబడాలన్నా, మునుపటి అభివృద్ధి, సంక్షేమం కావాలన్నా ఈ పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ తప్పకుండా గెలవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు జీవన్కుమార్, యండపల్లి వరప్రసాద్, బెల్లం ఉమ, దర్గయ్య, పేరం వెంకటేశ్వర్లు, లక్ష్మణ్నాయక్, బద్దె నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మెజార్టీ సీట్లు ఖాయమని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఖమ్మం అభ్యర్థి నామా నాగేశ్వరరావు గడిచిన నెల రోజులుగా ఏ గ్రామానికి వెళ్లినా జనం నీరాజనం పలుకుతున్నారని అన్నారు. అన్ని వర్గాల మద్దతూ బీఆర్ఎస్కే ఉందని అన్నారు. దీంతో కాంగ్రెస్కు దిక్కు తోచడం లేదని, దీంతో సోనియాగాంధీ నుంచి మొదలుకొని రోజుకొకరి పేరును తెరపైకి తెస్తోందని విమర్శించారు. ఈ మండలంలో నామాకు మరోసారి తిరుగులేని మెజార్టీ అందించాలని పిలుపునిచ్చారు.
అభ్యర్థులు లేక కాంగ్రెస్ కకావికలం.. : తాతా మధు, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు
‘అంతన్నడు ఇంతన్నాడే..’ అన్నట్లుగా ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి ఉందని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు విమర్శించారు. బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావును ఎదుర్కొనే సత్తా కలిగిన అభ్యర్థి లేక కాంగ్రెస్ పార్టీ కిందామీదా పడుతోందని ఆరోపించారు. దీనికి తోడు ప్రజల వద్దకు, రైతుల వద్దకు వెళ్లేందుకు ఆ పార్టీ నాయకులు వణుకుతున్నారని విమర్శించారు. కేసీఆర్ చేసిన మంచి పనులను తలుచుకుంటూ ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు పట్టం కట్టేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని స్పష్టం చేశారు.. దీంతో ప్రజల మద్దతు కూడగట్టలేక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని విమర్శించారు.
ఎప్పటికీ పాలేరే నా కుటుంబం : కందాళ ఉపేందర్రెడ్డి, పాలేరు మాజీ ఎమ్మెల్యే పాలేరు నియోజకవర్గం ఎప్పటికీ తన కుటుంబమేనని మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి అన్నారు. పాలేరు నియోజకవర్గ ప్రజలకు, తనకు విడదీయలేని అనుబంధం ఉందని అన్నారు. గత ఓటమిని బాధ్యతగా తీసుకొని రెట్టింపు ఉత్సాహంతో పని చేద్దామని, ఈ పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు ఇక్కడి నుంచి అఖండ మెజార్టీని అందిద్దామని పిలుపునిచ్చారు.