భద్రాద్రి కొత్తగూడెం, మే 2 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల విధులను నిష్పక్షపాతంగా నిర్వర్తించాలని, పోటీ చేస్తున్న అభ్యర్థులను ఒకే తరహాలో చూడాలని సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితేష్ వ్యాస్ అన్నారు. గురువారం న్యూఢిల్లీ నుంచి సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ఎన్నికల పోలింగ్ నిర్వహణ సన్నద్ధతపై నిర్వహించిన వీసీలో హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో కలిసి పాల్గొనగా.. ఐడీవోసీ నుంచి కలెక్టర్ ప్రియాంక ఆల, ఎస్పీ రోహిత్ రాజు, వ్యయ పరిశీలకులు రామ్కుమార్, గోపాల్తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ప్రియాంక ఆల మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 71 శాతం ఓటరు సమాచార స్లిప్పులు పంపిణీ చేశామని, మిగిలినవి సైతం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాకు కొత్తగా కేటాయించిన 1,700 బ్యాలెట్ యూనిట్లను రెండు రోజుల్లో ర్యాండమైజేషన్ పూర్తి చేసి అన్ని నియోజకవర్గాలకు పంపిణీ చేశామని తెలిపారు.ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావం లేకుండా అప్రమత్తంగా ఉంటూ ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టామన్నారు. సీ విజిల్, 1950 టోల్ఫ్రీ నంబర్ ద్వారా వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామన్నారు.
ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. ఈవీఎంల తరలింపు, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, రిసెప్షన్ కేంద్రాల వద్ద అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వ్యయ పరిశీలకులు రామ్కుమార్, గోపాల్ మాట్లాడుతూ చెక్పోస్టుల వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని, ఎంసీసీలో ఎఫ్ఎస్టీ, వీఎస్టీలో మో డల్ కండక్ట్ కోడ్ ఉల్లంఘించిన వారిపై తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలన్నారు. వీసీలో ఏఆర్వోలు ప్రతీక్ జైన్, వేణుగోపాల్, మధు, దామోదర్రావు, కాశయ్య, ఎలక్షన్ సూపరింటెండెంట్ దారా ప్రసాద్, డీసీవో సయ్యద్ ఖుర్షీద్ పాల్గొన్నారు.