మామిళ్లగూడెం, మే 2 : పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం, వీవీ ప్యాట్ల గోడౌన్లో చేపట్టిన అదనపు ఈవీఎంల ఫస్ట్ లెవల్ చెకింగ్ను ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం ఎంపీ ఎన్నికల్లో 35 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని, నోటాతో కలిపి 36 అవుతున్నారని తెలిపారు. ఒకో బ్యాలెట్ యూనిట్లో 16 మంది అభ్యర్థులకు అవకాశం ఉన్నందున ఎన్నికల నిర్వహణకు 3 బ్యాలెట్ యూనిట్ల అవసరం ఉందన్నారు.
దీనికి అదనపు ఈవీఎంలను సిద్ధం చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈవీఎం గోడౌన్లో ఉన్న వైరా అసెంబ్లీ సెగ్మెంట్కు చెందిన 252 బ్యాలెట్ యూనిట్లు, 252 కంట్రోల్ యూనిట్లు, అదనంగా కేటాయించిన 2,200 బ్యాలెట్ యూనిట్ల ఫస్ట్ లెవల్ చెకింగ్ను పార్టీల ప్రతినిధుల సమక్షంలో చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి.సత్యప్రసాద్, డి.మధుసూదన్నాయక్, కలెక్టరేట్ ఎన్నికల సూపరింటెండెంట్ రాంబాబు, పార్టీల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.