NEET PG 2026 : నీట్ పీజీ – 2026 (NEET-PG 2026) ప్రవేశ పరీక్షకు హాజరయ్యే కొందరు అభ్యర్థులకు సెంటర్ వివరాలు తప్పుగా వెళ్లాయి. సాంకేతిక సమస్య (Techincal Glitch) కారణంగానే ఈ పొరపాటు జరిగినట్లు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) బుధవారం స్పష్టంచేసింది. సరైన సెంటర్ వివరాలతో అభ్యర్థులకు మళ్లీ ఎస్ఎంఎస్, ఈ మెయిళ్లు పంపినట్లు పేర్కొన్నది. అభ్యర్థులకు కేటాయించిన పరీక్ష సెంటర్లను ఎన్బీఈఎంఎస్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు బోర్డు తెలిపింది.
గతంలో వచ్చిన ఎస్ఎంఎస్ను పరిగణనలోకి తీసుకోకుండా అధికారిక పోర్టర్లో వివరాలను సరిచూసుకోవాలని స్పష్టం చేసింది. నకిలీ వెబ్సైట్లు, తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని సూచించింది. వైద్య విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 30న పరీక్ష నిర్వహించనున్నారు. నీట్ పీజీ – 2026 దరఖాస్తుల్లో ఫొటో, సంతకం, వేలి ముద్ర నిబంధనలకు అనుగుణంగాలేని అభ్యర్థులకు ఎన్బీఈఎంఎస్ (NBEMS) చివరి అవకాశం ఇచ్చింది. ఆగస్టు 15 రాత్రి 11.55 గంటల వరకు ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపింది.
ఈ గడువులోగా తప్పులను సరిచేయకపోతే దరఖాస్తును తిరస్కరించే అవకాశం ఉందని బోర్డు స్పష్టంచేసింది. అభ్యర్థులు ఎన్బీఈఎంఎస్ అధికారిక వెబ్సైట్లో తమ వివరాలతో లాగిన్ అయి.. అప్లోడ్ చేసిన ఫొటో, సంతకం, బొటనవేలి ముద్ర ఆమోదం పొందాయో లేదో చూసుకోవాలని పేర్కొన్నది. నిబంధనలకు సరిపోని వాటిని గడువులోగా సరిచేయాలని తెలిపింది. పరీక్షతోపాటు కౌన్సెలింగ్ ప్రవేశ ప్రక్రియ పూర్తయ్యే వరకు దరఖాస్తులో ఇచ్చిన ఈమెయిల్, మొబైల్ నంబర్ను అందుబాటులో ఉంచుకోవాలని బోర్డు సూచించింది. ముఖ్యమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు వాటి ద్వారా పంపే అవకాశం ఉన్నందున అభ్యర్థులు తరచూ పరిశీలించుకోవాలని పేర్కొన్నది.