మామిళ్లగూడెం, మే 2 : పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియలో మైక్రో, జనరల్ అబ్జర్వర్ల పాత్ర ఎంతో కీలకమని, ఎన్నికల నిర్వహణకు వారు కళ్లు, చెవుల లాంటి వారని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల జనరల్ అబ్జర్వర్ డాక్టర్ సంజయ్ జి కోల్టే అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మైక్రో అబ్జర్వర్లకు నిర్వహించిన రెండో విడత శిక్షణా కార్యక్రమానికి ఆయన హాజరై అవగాహన కల్పించారు. ఒకే లొకేషన్లో ఒకటి కన్నా ఎకువ పోలింగ్ కేంద్రాలున్న ప్రాంతాల్లో మైక్రో అబ్జర్వర్లను నియమించామన్నారు.
ఈ నెల 12న పోలింగ్కు ఒకరోజు ముందు మైక్రో అబ్జర్వర్లు వారి వారి నియోజకవర్గ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద ఉదయం 8 గంటలకు రిపోర్ట్ చేయాలని, అకడి నుంచి పోలింగ్ సిబ్బందితోపాటు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లాలని సూచించారు. పోలింగ్ ముగిసిన తర్వాత నియోజకవర్గం మొత్తానికి ఒకేచోట శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రంలో నివేదికలు సమర్పించాలన్నారు. మాక్ పోలింగ్ ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు చేపట్టాలన్నారు.
పోలింగ్ కేంద్రంలోకి ఎవరెవరు ప్రవేశిస్తున్నది, ఎంత మంది పార్టీల ఏజెంట్లు పోలింగ్ కేంద్రంలో ఉన్నది చూసుకోవాలన్నారు. ఇండెలిబుల్ ఇంక్ సరిగా చేస్తున్నది అధికారులు పరిశీలించాలన్నారు. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ.. తమ విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు. అనంతరం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా మైక్రో అబ్జర్వర్లకు విధులు, బాధ్యతలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో శిక్షణ నోడల్ అధికారి, జిల్లా వ్యవసాయాధికారి విజయనిర్మల, ఎల్డీఎం శ్రీనివాసరెడ్డి, జిల్లాస్థాయి మాస్టర్ ట్రెయినర్ కె.శ్రీరామ్, మదన్గోపాల్, అధికారులు పాల్గొన్నారు.