Motkupalli Narasimhulu | హైదరాబాద్ : పరిపాలనలో రేవంత్ రెడ్డి కంటే కేసీఆరే నయం అనిపిస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి మాదిగ జాతిని ఎదగకుండా బొంద పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్లో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు.
రేవంత్ కంటే కేసీఆరే నయం అనిపిస్తుంది. సాగునీరు లేక పొలాలు ఎండిపోతున్నాయి. కరెంటు లేదు. దళితబంధు లేదు. రైతు బంధు లేదు. తులం బంగారం లేదు. రూ. 2500 మహాలక్ష్మి పథకం లేదు. ఈ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నడుస్తుంది. రేవంత్ రెడ్డిని కలుస్తున్న వాళ్ళు మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారులే. వారు తప్ప, పేదలు ఎవరు రావట్లేదు. పేరుకి ప్రజాపాలన అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ప్రగతి భవన్లో ప్రజాపాలన అని పెట్టి 3 రోజులకే ముసేశారు. ఒక్కసారి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మళ్ళీ ఎందుకు రాలేదు? అంత పని ఏం ఉంది? అని మోత్కుపల్లి నర్సింహులు నిలదీశారు.
సీఎం రేవంత్ రెడ్డి ఏ ఒక్క స్కీమ్ మీద కూడా దృష్టి పెట్టడం లేదు. ఏమైనా అంటే పైసల్ లేవు.. పైసల్ లేవు అంటావు.. పైసల్ ఉంటే నువ్వు ఎందుకు, పైసల్ లేకున్నా పనులు చేయగలిగిన వాడే సమర్థుడు. ఇదేమి వ్యాపార సంస్థ కాదు.. ప్రజాసంస్థ అని కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నరసింహులు పేర్కొన్నారు.