బాన్సువాడ/గాంధారి/ బిచ్కుంద, ఏప్రిల్ 15: ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఓటుతోనే గుణపాఠం చెప్పాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం బాన్సువాడ, బిచ్కుంద, గాంధా రి మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహించగా.. పోచారంతోపాటు జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్, మాజీ ఎమ్మెల్యేలు జాజాల సురేందర్, హన్మంత్ షిండే, బీఆర్ఎస్ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి పోచారం భాస్కర్రెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. గతంలో బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు 24వేల ఇందిరమ్మ ఇండ్ల బిల్లులను బినామీల పేరిట దోచుకున్నారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అబద్ధపు హామీలతో గద్దెనెక్కి, ఏ ఒక్క హామీని నెరవేర్చడంలేదని, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కర్రుకాల్చి వాత పెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో నిర్వహించిన సభల్లో రేవంత్రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను ఎల్ఈడీ స్క్రీన్పై ప్రదర్శించి గుర్తుచేశారు.ఎన్నికల్లో రేవంత్ రెడ్డి మాటలను నమ్మి ప్రజలు మోసపోయారన్నారు.కల్యాణలక్ష్మితోపాటు తులం బంగా రం ఎక్కడైనా ఇస్తే తాను తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. పాలిచ్చే బర్రెను వదులుకొని, గొడ్డు బర్రెను కొనుకున్నామని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు. వందరోజుల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో గ్రామాల్లో వెళ్లాలంటే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భయపడుతున్నారని అన్నారు. ఎంపీగా పదేండ్లు పనిచేసిన బీబీ పాటిల్ నియోజకవర్గానికి చేసిందేమీలేదన్నారు. ప్ర జల నుంచి ఓట్లు వేసుకొని వ్యాపారాలు చేసుకుంటున్న ఆయనకు ఓటుతోనే సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. ఒకరిద్దరు పార్టీ మారినా బీఆర్ఎస్కు వచ్చే నష్టం ఏమీలేదని, కార్యకర్తలే అండగా ఉంటారని అన్నారు.
తనను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే వారి అడ్రస్సులు గల్లంతవుతాయని పోచారం స్పష్టం చేశారు. తన రాజకీయ జీవితంలో శత్రువులకు సైతం తాను సాయం చేశానే తప్ప వ్యక్తిగతంగా కక్ష సాధించలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని సూచించారు. బీఆర్ఎస్లో కార్యకర్తలు ముత్యంలాంటి వారు ఉన్నారని, దొంగలు బయటపడ్డారని పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి పోచారం భాస్కర్రెడ్డి అన్నారు. కార్యకర్తలకు తామెప్పుడు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కారుగుర్తుకు ఓటు వేసి గాలి అనిల్ కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి బలమని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. కొందరు నాయకులు పార్టీని వదిలి వెళ్లిపోయారని, వారు పోతే కొత్త నాయకులను తయారు చేస్తామని అన్నారు.
గతంలో ఐదేండ్లు కాంగ్రెస్ నుంచి ఎంపీగా పనిచేసిన సురేశ్ షెట్కార్, రెండుసార్లు ఎంపీగా ఉన్న బీబీ పాటిల్ జహీరాబాద్ నియోజకవర్గానికి ఏం చేశారో వారిని గ్రామాల్లో నిలదీయాలని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 70 ఏండ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. తాను గెలిచిన వెంటనే మొదటగా బాన్సువాడ నియోజక వర్గం మీదుగా రైల్వే లైన్ ఏర్పాటు కోసం కొట్లాడుతానని తెలిపారు.