నిజామాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ; ఉమ్మడి జిల్లాలో వడ్డీ వ్యాపారులపై దాడుల నేపథ్యంలో ‘బీర్షెబా’ వ్యవహారం తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేపిన భారీ ఆర్థిక మోసంపై పోలీస్ శాఖ మౌనం వహిస్తుండడం తాజాగా చర్చనీయాంశమైంది. సరిగ్గా నాలుగేళ్ల క్రితం కామారెడ్డి జిల్లా కేంద్రంగా వెలుగు చూసిన రూ.వందల కోట్ల ఆర్థిక మోసంలో బాధితులు వేలల్లో ఉన్నారు. సదాశివనగర్ మండలానికి చెందిన ఓ వ్యక్తి కొంత మంది పోలీసుల సహకారంతో నెలల వ్యవధిలోనే ప్రజల నుంచి వందల కోట్ల రూపాయలను వసూలు చేసి పరారయ్యాడు. మొదట్లో ప్రజలకు లాభాలను పంచి పెడుతున్నట్లు నటించి, అందరినీ నమ్మించాడు. ఆశ పడి డబ్బులు పెట్టిన సామాన్యులను నిలువునా ముంచేశాడు. ఇంత భారీ ఆర్థిక మోసంలో నాడు పోలీసులు సైతం పాత్రధారులుగానే ఉన్నట్లు ప్రజలు అనుమానించారు. అక్రమంగా కోట్లల్లో లావాదేవీలు జరిపినా అప్పట్లో కళ్లు మూసుకున్నారు. నాడు డీఎస్పీ, సీఐలుగా పని చేసిన వారి నుంచి లభించిన మద్దతుతో అక్రమార్కులు రెచ్చిపోయారు. వీరిలో ఇద్దరు అధికారులు వేరే అక్రమాల్లో ఏసీబీకి చిక్కి జైలు పాలయ్యారు. మరికొంత మంది చాకచక్యంగా తప్పించుకుని ఇప్పుడు కామారెడ్డి జిల్లాలోనే కీలక పోస్టింగ్లలో రాజ్యమేలుతుండడం గమనార్హం. ప్రస్తుతం వడ్డీ వ్యాపారులపై పోలీసులు దాడులు చేస్తున్న తరుణంలో బీర్షెబా కేసు ఏమైదంటూ బాధితులు ప్రశ్నిస్తున్నారు.
కష్టపడి సంపాదించుకున్న పదో, పరకో పెట్టుబడి పెడితే రెట్టింపు నగదు వస్తుందన్న ప్రచారం సామాన్యులను నిండా ముంచింది. పేద, మధ్యతరగతి కుటుంబాల్లో సంపాదన అన్నది కుటుంబ పోషణ, జీవన గమనానికి సరిపోతుంది. శ్రమకోర్చే జీతంతోపాటు అదనంగా వచ్చే ఆదాయంతో సులభంగా తమ అవసరాలను తీర్చుకోవచ్చని భావిస్తుంటారు. అలా ఆశపడిన వారినే బుట్టలో వేసుకున్నారు. బీర్షెబా పేరిట ఆర్థిక కార్యకలాపాలను నడిపి నట్టేట ముంచేశారు. రూ.30వేలు చెల్లిస్తే వరుసగా ఆరు నెలల పాటు రూ.10 వేలు చొప్పున అంటే మొత్తం రూ.60వేలు ఇస్తామంటూ నమ్మించి సామాన్యులను మోసం చేసిన ఘటనే బీర్షెబా వ్యవహారం. గొలుసు కట్టు వ్యాపారం తరహాలో రెట్టింపు లాభాల ఆశను చూపి, భారీ నజరానాలు, బహుమతులతో ఆకర్షించి వేల మందిని మోసగించిన ఘటనకు నాలుగేళ్లవుతున్నది. రూ.300కోట్లతో దుకాణం ఎత్తేసిన ఈ వ్యవహారం ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, వరంగల్, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, నిజామాబాద్, కామారెడ్డితో పాటు హైదరాబాద్ చుట్టు ప్రాంతాల వారు సైతం డబ్బులకు ఆశపడి పెట్టుబడులు పెట్టారు. కొద్ది కాలం పాటు నిర్వాహకులు సవ్యంగానే డబ్బులు తిరిగి ఇచ్చారు. ప్రజల సొమ్మును రొటేషన్ పద్ధతిలో తిప్పి వాటిని ఇతరత్రా వ్యాపారాల్లో, భూములపై పెట్టుబడులు పెట్టారు. బీర్షెబా స్కీమ్ ప్రారంభ దశలో లాభాలు ఆర్జించిన వారు మినహా ఆ తర్వాత అత్యాశకు వెళ్లిన వారు, చివరకు రెట్టింపు లాభాల కోసం పెట్టుబడులు పెట్టిన వారం తా నిండా మునిగి పోయారు.
స్పందించేనా?
వడ్డీ వ్యాపారుల ఆట కట్టిస్తున్న పోలీసులు గతంలో కామారెడ్డి వేదికగా జరిగిన ఆర్థిక మోసాన్ని ఛేదిస్తారా.. లేదా? అన్నది జవాబు లేని ప్రశ్నగా మారింది. శ్వేతారెడ్డి ఎస్పీగా ఉన్నప్పుడు ఈ వ్యవహారం వెలుగు చూసింది. ఆమె బదిలీ అయిన తర్వాత శ్రీనివాస్రెడ్డి ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. కొంతమంది బాధితులు ఫిర్యాదు చేసినా ఆయన పట్టించుకోలేదని విమర్శలు ఉన్నాయి. నిఘా విభాగంలో పని చేసిన ఓ వ్యక్తి ఎస్పీని తప్పుదారి పట్టించినట్లు పోలీస్ శాఖలో చర్చ జరిగింది. ఇప్పుడు అదే వ్యక్తి కీలకమైన పోస్టులో పని చేస్తున్నారు. బీర్షెబా ఉదంతం వెలుగు చూసిన సమయంలో డీఎస్పీ, టౌన్ సీఐలు, గ్రామీణ ప్రాంత పోలీసు అధికారులు విచ్చలవిడిగా డబ్బులు సంపాదించారనే ఆరోపణలు ఉన్నాయి. అందులో భాగంగానే మోసపూరిత వ్యాపారం జరుగుతున్నదని తెలిసినా దాడులు చేయక మిన్నకుండిపోయారనే వాదన వినిపించింది. బీర్షెబా వ్యవహారాన్ని కూపీ లాగితే చాలా మంది అక్రమార్కులు బయటపడే అవకాశముంది. భారీ మోసానికి పాల్పడిన కీలక నిందితుడు ఇప్పుడు దర్జాగా తిరుగుతుంటే.. మోసపోయిన బాధితులు తెల్లమొహం వేస్తున్నారు. సంచలనం సృష్టించిన ఈ ఆర్థిక నేరానికి సంబంధించిన ఫైల్ను తెరిచి కేసును ఛేదిస్తే వేలాది కుటుంబాలకు న్యాయం జరుగుతుంది. వడ్డీ వ్యాపారులపై కొరడా ఝళిపిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్న ఎస్పీ సింధూశర్మ.. బీర్షేబా కేసును కూడా ఛేదించి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.