Ramayana | భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రాల్లో రామాయణ ఒకటి. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి సీతాదేవి పాత్రలో నటిస్తున్న ఈ భారీ పౌరాణిక చిత్రానికి ప్రముఖ దర్శకుడు నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు. హిందీతో పాటు తెలుగు సహా పలు భారతీయ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, ప్రచార పోస్టర్లు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచగా, ఇప్పుడు సినిమా ట్రైలర్కు సంబంధించిన తాజా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొదట ఈ చిత్రం ట్రైలర్ను గత వారం విడుదల చేయాలని మేకర్స్ భావించినట్లు ప్రచారం జరిగింది. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ట్రైలర్ విడుదల వాయిదా పడినట్లు వార్తలు వచ్చాయి.
ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం, జూలై 30న ‘రామాయణ’ ట్రైలర్ను డిజిటల్ వేదికగా విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో అభిమానులు అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల జరిగిన అంతర్జాతీయ కామిక్-కాన్ ఈవెంట్లో ప్రదర్శించిన సుమారు నిమిషన్నర నిడివి గల ప్రత్యేక ట్రైలర్ విజువల్స్ ఆన్లైన్లో లీక్ అయిన సంగతి తెలిసిందే. ఆ విజువల్స్ సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొట్టాయి. తాజాగా మరోసారి సినిమాకు సంబంధించిన కొన్ని విజువల్స్, క్లిప్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వాటిలో కనిపిస్తున్న విజువల్ క్వాలిటీ, గ్రాఫిక్స్, పాత్రల డిజైన్ చూసిన అభిమానులు సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
అయితే ఈ లీక్ వీడియోలకి సంబంధించి చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.’రామాయణం’ చిత్రాన్ని అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్తో అంతర్జాతీయ స్థాయిలో రూపొందిస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ వెల్లడించారు. లీక్ అయినట్లు ప్రచారం జరుగుతున్న విజువల్స్ కూడా అదే స్థాయిలో ఉండటంతో, ట్రైలర్ ఎలా ఉండబోతుందనే ఆసక్తి అభిమానుల్లో మరింత పెరిగింది.పౌరాణిక కథను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్న ఈ సినిమా భారతీయ సినీ పరిశ్రమలో కొత్త ప్రమాణాలను సృష్టిస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చిత్రంలో శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి నటించడం ప్రధాన ఆకర్షణగా మారింది. ఇద్దరూ ఈ పాత్రల కోసం ప్రత్యేకంగా సిద్ధమయ్యారని ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు వెల్లడించారు. ముఖ్యంగా సాయి పల్లవి సీత పాత్రలో ఎలా కనిపించబోతున్నారనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.