బోధన్, ఏప్రిల్ 26: బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఢిల్లీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి అటానమస్ హోదా లభించినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ సురేశ్ తెలిపారు. శుక్రవారం కళాశాలకు లభించిన హోదాపై విలేకరులతో మాట్లాడారు. కళాశాల భవనంతోపాటు ఆహ్లాదకరమైన వాతావరణం, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్యాబోధన అందిస్తున్న తమ కళాశాలకు ఎన్ఎఎసీ (బీ) గ్రేడ్ కల్పించిన కళాశాలల్లో బోధన్ కళాశాల ద్వితీయ స్థానంలో ఉందని చెప్పారు. మూడు మాధ్యమాల్లో విద్యాబోధన అందిస్తున్న ఏకైక కళాశాలగా గుర్తింపు పొందినట్లు తెలిపారు. స్వయం ప్రతిపత్తితో అకడమిక్ సౌలభ్యం, స్థానిక అవసరాల దృష్ట్యా తామే 20% సిలబస్ మార్పునకు అవకాశం, ప్రత్యేక పరీక్షల విభాగాన్ని ఏర్పాటు చేసుకుని స్వయంగా పరీక్షల నిర్వహణ మెరుగైన ఫలితాలకు ఎంతో దోహదంగా ఉంటుందని తెలిపారు. కళాశాలకు ‘అటానమస్ హోదా’ రావడంపై కళాశాల అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ డాక్టర్ సురేశ్, వైస్ ప్రిన్సిపాల్ రంగారత్నంను అభినందించారు.