ఏర్గట్ల/ భీమ్గల్, ఏప్రిల్ 27 : ఇచ్చిన హామీలను నేరవేర్చడంలో సీఎం రేవంత్రెడ్డి విఫలం కావడం, పాలనపై ప్రజల్లో వ్యతిరేకత రావడంతో ప్రజలను నమ్మించడానికి దేవుళ్ల మీద ఒట్టు వేస్తున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ వేసే ఒట్లకు దేవుళ్లు సైతం భయపడతారని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్కు మద్దతుగా ఏర్గట్ల మండలంలోని తాళ్ల రాంపూర్, గుమ్మిర్యాల్తోపాటు భీమ్గల్ మండలంలోని రహత్నగర్, దేవక్కపేట్ గ్రామాల్లో శనివారం సాయంత్రం రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్రెడ్డి ఇచ్చిన పెన్షన్ పెంపు, ఆడబిడ్డల పెండ్లికి తులం బంగారం, రైతు భరోసా, రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు తదితర హామీలను నెర్చవేర్చడంలో విఫలమయ్యారని అన్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ గత పార్లమెంట్ ఎన్నికల్లో అబద్ధపు హామీలు ఇచ్చి గద్దెనెక్కాడని, తర్వాత రైతులకు ఇచ్చిన మాట తప్పాడని అన్నారు. మళ్లీ పసుపు బోర్డు ఏర్పాటు గురించి మాట్లాడుతున్నాడన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఇచ్చిన హామీలను ట్యాబ్ ద్వారా రైతులకు ఎమ్మెల్యే వినిపించి, వారు చేసిన మోసాలను ఎండగట్టారు. కాంగ్రెస్, బీజేపీ నేతలకు ఈ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజల తరఫున పోరాడే పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని, బాజిరెడ్డి గోవర్ధన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమాల్లో ఎంపీపీ కొలిప్యాక ఉపేందర్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎనుగందుల రాజపూర్ణానందం, సొసైటీ చైర్మన్లు పెద్దకాపు శ్రీనివాస్రెడ్డి, బర్మ చిన్న నర్సయ్య, ఏర్గట్ల సొసైటీ వైస్ చైర్మన్ గంగారాం, మండల ఉపాధ్యక్షుడు సోమిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, మాజీ సర్పంచులు భీమనాతి భానుప్రసాద్, గద్దె గంగారాం, పత్తిరెడ్డి ప్రకాశ్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.