Janhvi Kapoor | ప్రముఖ బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తన వ్యక్తిత్వ హక్కుల (పర్సనాలిటీ రైట్స్) పరిరక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పేరు, ఫొటోలు, వీడియోలను అడ్డుపెట్టుకుని సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు, AI ద్వారా సృష్టించిన డీప్ఫేక్ వీడియోలను ప్రచారం చేస్తున్నారని ఆమె తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. అయితే ఈ పిటిషన్పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనూప్ జైరామ్ భంభాని కీలక ఆదేశాలు జారీ చేశారు. అసభ్యకరంగా ఉన్న కంటెంట్ను, అలాగే ఎవరైనా ఆమె పేరును వాణిజ్యపరంగా దుర్వినియోగం చేస్తుంటే ఆ పోస్టులను తక్షణమే తొలగించాలని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. పర్సనాలిటీ రైట్స్ అనే భావనకు ఒక సరైన హద్దు ఉండాలని, సెలబ్రిటీల హక్కులను రక్షించడంతోపాటు భావప్రకటన స్వేచ్ఛను కూడా సమతుల్యం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా అన్ని ఫ్యాన్ పేజీలపై ఒకేసారి నిషేధం విధించలేమని కోర్టు పేర్కొంది. కేవలం వాణిజ్య ప్రయోజనాల కోసం లేదా డబ్బు సంపాదనే లక్ష్యంగా ఎవరైనా ఆమె పేరును వాడుకుంటేనే కచ్చితంగా చర్యలు తీసుకోవచ్చునని, అయితే అన్ని ఫ్యాన్ పేజీలను నేరపూరితమైనవిగా పరిగణించలేమని తెలిపారు. కొందరు వ్యంగ్యంగా లేదా విమర్శనాత్మక ధోరణిలో కూడా పోస్టులు చేసే అవకాశం ఉందని న్యాయమూర్తి గుర్తుచేశారు.
ఈ కేసులో మెటా (Meta) తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ తరఫున ఇప్పటికే 4,000కు పైగా యూఆర్ఎల్లను (URLs) సమర్పించారని, అయితే ఆ కంటెంట్ అంతా ఒకేలా అభ్యంతరకరంగా లేదని కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో, ఆరోపణలు ఎదుర్కొంటున్న కంటెంట్ను స్పష్టమైన వర్గాలుగా విభజించి తదుపరి విచారణకు కోర్టు ముందుంచాలని పిటిషనర్ తరఫు న్యాయవాదిని న్యాయమూర్తి ఆదేశించారు. గతంలో కూడా పలువురు ప్రముఖ నటీనటులు, క్రీడాకారులు, రాజకీయ నాయకులు తమ వ్యక్తిత్వ హక్కుల రక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.