KCR | స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మండిపడ్డారు. వరంగల్, హనుమకొండలో కేసీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్నర్ మీటింగ్లో మాట్లాడుతూ.. ‘ఇక్కడ ఒక మనిషికి టికెట్ ఇచ్చాం. ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చాం. ఇప్పుడు ఎందుకు పార్టీ మారిపోయిండు. ఎందుకోసం మారిండు పార్టీ ? కడియం శ్రీహరి చేసిన మోసానికి శాశ్వతంగా రాజకీయ జీవితాన్ని సమాధి చేసుకున్నడు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. ఇంకో మూడునెలల్లో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రాక తప్పదు. మన రాజయ్య ఎమ్మెల్యే కాక తప్పదు. మీరు రాసిపెట్టండి. నేను చెబుతున్న జరుగబోయేది సత్యం. ఖచ్చితంగా మూడునెలల్లో ఉప ఎన్నిక రాక తప్పదు. ఇదే రాజయ్య ఎమ్మెల్యే కాక తప్పదు. ద్రోహులకు చెప్పే గుణపాఠం అదే’నన్నారు.
‘కాంగ్రెస్ గవర్నమెంట్ ఇన్ని హామీలు ఇచ్చారు.. అమలు చేస్తలేరని అని మన ప్రతినిధులు అసెంబ్లీలో అడిగారు. ముఖ్యమంత్రి ఏమంటున్నడు. కేసీఆర్ నీ గుడ్లుపీకి గోళీలు ఆడుకుంటా.. నీ పేగులు తీసి మెడలో వేసుకుంట.. ఆఖరికి నీ ముడ్డిమీది చెడ్డి కూడా గుంజుకుంట అంటున్నడు. నేను పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న.. నా నోట ఇలాంటి మాట నా నోటి నుంచి విన్నరా? కేసీఆర్ నిన్ను కొంచబోయి చర్లపల్లి జైలులో వేస్తా? జైళ్లకు తోకమట్టకు నేను భయపడుతనా? కేసీఆర్ జైళ్లకు భయపడితే తెలంగాణ వచ్చేదా? ఎన్ని దెబ్బలు తిన్నం. ఎన్ని నిరాహార దీక్షలు చేశాం. ఎన్ని రాజీనామాలు చేశాం. ఎన్నిసార్లు పదవులను ఎడమకాలి చెప్పులా విసిరేసినం. గట్ల భయపడితే తెలంగాణ వచ్చేదా?’ అని ప్రశ్నించారు.
‘బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులకు నా మనవి. తెలంగాణ ఉద్యమం అయిపోలేదు. ఇంకా తెలంగాణ పునర్నిర్మాణం మిగిలే ఉన్నది. ఇంకా చాలా అభివృద్ధి చేయాలి. అభివృద్ధి అంటే ఎట్ల ఉంటదో వరంగల్లో కట్టిన ఆసుపత్రే నిదర్శనం. ఆకాశమంత ఎత్తున ఇవాళ అందరికీ కనిపిస్తున్నది. అలాంటి ప్రతిభ ముందుకుపోవాలి. అలాంటి ప్రగతిలో తెలంగాణ రాష్ట్ర ముందుకు దూసుకుపోవాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలవాలి. మే పార్టీ 13 వరకు ఇదే ఉత్సాహం కొనసాగించాలి. చైతన్యం ఉన్న ఈ వరంగల్ గడ్డ మీద గులాబీ జెండా ఎగురవేయాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నా’నన్నారు.